మామిడి పండ్లను సహజంగా మగ్గపెట్టాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:27 AM
కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న జేసీ

తిరుపతి(కలెక్టరేట్), ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ‘వరిగడ్డి, కార్డ్బోర్ బాక్సు, పేపర్ బ్యాగ్స్ను ఉపయోగించి సహజసిద్ధంగా మామిడి పండ్లను మగ్గపెట్టాలి. అనుమతుల్లేని కాల్షియం కార్బైడ్ను ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది’ అంటూ వ్యాపారులను జేసీ శుభం బన్సల్ హెచ్చరించారు. పండ్లు మగ్గపెట్టడం కాల్షియం కార్బైడ్ను నిరోధించడంపై కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మామిడి పండ్లు సీజన్ మొదలవుతున్న కారణంగా ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలతో మామిడి పండ్లు మగ్గపెట్టే ప్రక్రియను నిరోధించడంపై ఆయన అధికారులతో చర్చించారు. కమిటీలోని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. దీనిపై పండ్ల వ్యాపారులకూ అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి, డీపీవో సుశీలాదేవి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర్రావు, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి, ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.