Tirumala: తిరుమలలో మళ్లీ ప్లాస్టిక్ బాటిల్స్?
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:24 AM
తిరుమలలో గాజు నీళ్ల సీసాల స్థానంలో మళ్లీ పాస్టిక్ బాటిల్స్ను అనుమతించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టు తెలుస్తోంది.

తిరుమల, మార్చి22 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గాజు నీళ్ల సీసాల స్థానంలో మళ్లీ పాస్టిక్ బాటిల్స్ను అనుమతించే ఆలోచనలో టీటీడీ ఉన్నట్టు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ దృష్టితో 2020లో తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించారు. ఇందులో భాగంగానే వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాలు ప్రవేశపెట్టారు. ఒక లీటర్ బాటిల్ రూ.50. ఏ దుకాణంలో బాటిల్ వెనక్కి ఇచ్చినా రూ.30 ఇస్తారు. అయితే చాలామంది భక్తులు వెనక్కివ్వకుండా పడేస్తున్నట్టు గుర్తించారు. ఇవి పగిలి ప్రమాదకరంగా మారుతున్నాయి. దీనికితోడు గొడవపడ్డ సమయంలో భక్తులు గాజు సీసాలను ఆయుధాలుగా వాడేస్తున్నారు. గత జూలైలో వైజాగ్కు చెందిన ఒక కుటుంబంతో మాటామాటా పెరిగి దుకాణంలో పనిచేసే వ్యక్తి గాజు సీసాతో దాడి చేయడంతో భక్తుడు, అడ్డు వెళ్లిన హోంగార్డు గాయపడ్డారు. తాజాగా గురువారం మరో సంఘటనలో కర్ణాటక, తమిళనాడు భక్తుల మధ్య జరిగిన ఘర్షణలో గాజు బాటిల్తో దాడిలో ఇద్దరు రక్తగాయాల పాలయ్యారు. వీటి స్థానంలో బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ బాటిళ్లు, టెట్రా వాటర్ ప్యాకెట్ల వినియోగంపై టీటీడీ ఉన్నతాధికారులకు కొన్ని సంస్థలు డెమో ఇచ్చాయి.వీటి వినియోగంపై పరిశీలనకు ఓ ప్రత్యేక కమిటీని టీటీడీ ఈవో శ్యామలరావు నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.