Pawan Kalyan: పవన్ కల్యాణ్ కుమారుడికి ప్రమాదం.. ఏమైందంటే..
ABN , Publish Date - Apr 08 , 2025 | 09:22 AM
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూలులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్కు గాయాలు అయ్యాయి. గాయాలు అవడంతో వెంటనే ఆస్సత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ప్రమాదం జరిగింది. సింగపూర్లోని ఓ స్కూల్లో మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. బాబుకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యాడు. మార్క్ శంకర్కు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటనను పవన్ కల్యాణ్ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ సింగపూర్ పయనం కానున్నారు.
ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్కు ఈ విషయం తెలియడంతో వెంటనే పర్యటన నిలిపివేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, కూటమి నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు మాట ఇచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు.
మన్యంలో మధ్యాహ్నం లోగా పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పవన్ కల్యాణ్తో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పవన్ కల్యాణ్కు మెగా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి సింగపూర్లో ప్రస్తుత పరిస్థితిపై సమాచారం తెలుసుకుంటున్నారు. సింగపూర్ వైద్యులతో పవన్ కల్యాణ్, చంద్రబాబు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సింగపూర్ వైద్యులు తెలిపారు.
ఆ విషయం ఆందోళన కలిగించింది: సీఎం చంద్రబాబు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న మార్క్ శంకర్కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందని ముఖ్యమంత్రి తెలిపారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్చ తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించానని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హెచ్సీయూ విద్యార్థులపై కేసుల ఎత్తివేత
For More AP News and Telugu News