గందరగోళ పరీక్ష
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:35 AM
జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ పరీక్షల నిర్వహణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంత గందరగోళం ఏర్పడింది. పదో తరగతి పబ్లిక్, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు ఒకేసారి ఒకే సమయంలో ఒకే కేంద్రంలో నిర్వహించాల్సి రావడం ఇందుకు కారణమైంది.

ఒక్కో కేంద్రానికి ఇద్దరేసి చీఫ్లు, డీవోలు
పబ్లిక్, ఓపెన్ కలిపి నిర్వహణ
23 చోట్ల ఇదీ పరిస్థితి
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు
జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభంకానున్న పదో తరగతి, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ పరీక్షల నిర్వహణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంత గందరగోళం ఏర్పడింది. పదో తరగతి పబ్లిక్, ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు ఒకేసారి ఒకే సమయంలో ఒకే కేంద్రంలో నిర్వహించాల్సి రావడం ఇందుకు కారణమైంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు ఒక చీఫ్ను, ఒక డిపార్ట్మెంట్ అధికారి (డీవో)ని... ఓపెన్ స్కూలు పరీక్షల నిర్వహణకు వేరుగా మరో చీఫ్, డీవోను నియమించారు. ఒకే కేంద్రంలో రెండు విభాగాల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావడం, వారికి వేర్వేరుగా అధికారులను నియమించడం చర్చనీయాంశమైంది.
ఒంగోలు విద్య, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓపెన్ స్కూలు పరీక్షల్లో బహిరంగంగా జరిగే కాపీయింగ్ను ఈ ఏడాది అరికట్టాలని భావించింది. ఈనేపథ్యంలో గతంలో వేర్వేరుగా జరిగే పబ్లిక్, ఓపెన్ స్కూలు పరీక్షలను ఎస్ఎస్సీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రా ల్లో రెగ్యులర్, ఓపెన్ విద్యా ర్థులకు కలిపి సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం మొత్తానికి ఒక చీఫ్, ఒక డిపార్ట్మెంట్ అధికారిని.. ఓపెన్ స్కూలు ప్రశ్నపత్రాల భద్రత కోసం ఒక అదనపు డీవోను నియమించారు. విద్యార్థులకు హాల్ టికెట్లు కూడా సిద్ధమయ్యాయి. తీరా పరీక్షలకు పది రోజుల ముందు సీన్ మొత్తం మారిపోయింది. ఓపెన్ స్కూల్ సొసైటీ రాష్ట్ర కార్యాలయంలో ఎవరో చక్రం తిప్పడంతో మొదట ఏర్పాట్లను తూచ్ అని ఓపెన్ పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్, ఒక డీవోను నియమించారు.
23 కేంద్రాలకు ఇద్దరేసి చీఫ్లు
జిల్లాలో ఓపెన్ స్కూల్ 10వ తరతి పరీక్షలకు హాజరయ్యే 1,564 మంది విద్యార్థుల కోసం 23 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక కేంద్రానికి సగటున 68 మందిని కేటా యించారు. రెగ్యులర్, ఓపెన్ విద్యార్థులకు వేర్వేరుగా ఇద్దరు చీఫ్లు, ఇద్దరు డిపార్ ్టమెంట్ అధికారులు, ఇద్దరు ఇన్విజిలేటర్లను కూడా వేర్వేరుగా నియమించారు. దీంతో పరీక్షల్లో కాపీయింగ్కు చెక్ పెట్టేందుకు ప్రభు త్వం తొలుత చేపట్టిన చర్యలు అటకెక్కాయి. ప్రస్తుతం గతంలో వలే యఽథావిధిగా పరీక్షలు జరగనున్నాయి. రెగ్యులర్ తరహాలోనే ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా పరీక్షలు రోజు మార్చి రోజు ఉంటాయి. ఈనెల 17న హిందీ, 19న ఇంగ్లీషు, 21న తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, 24న గణితం, భారతీయ సంస్కృతం, పౌరసత్వం, 26న శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, గృహవిజ్ఞాన శాస్త్రం, 28న సాంఘిక శాస్త్రం, ఆర్థికశాస్త్రం సబ్జెక్టుల పరీక్షలు జరుగుతాయి.