Heatwave in AP: ఆ జిల్లాలకు హెచ్చరిక జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. అసలు విషయం ఇదే..
ABN , Publish Date - Mar 09 , 2025 | 09:24 PM
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఎండలు, రాత్రి వేళ చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. రానున్న రెండ్రుజుల్లో అల్లూరి సీతారామరాజు , పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీయనున్నట్లు హెచ్చరించారు. ఈ రెండ్రుజులపాటు ఆయా జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోమవారం రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, మారేడుమిల్లి, నెల్లిపాక, వై.రామవరం మండలాల్లో వడగాల్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాల్లో వేడి గాలులు భారీగా వీయనున్నట్లు హెచ్చరించారు. అలాగే ఏలూరు జిల్లాలోని కుకునూర్, వేలేర్పాడు మండలాల్లోనూ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మంగళవారం నాడు ఈ మూడు జిల్లాల్లోని 39 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఆయా జిల్లాల ప్రజలు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు కండువా లేదా రుమాలు తలకు కట్టుకోవాలని, వెంట గొడుగు తీసుకెళ్లాలని చెప్పారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఎండలు, రాత్రి వేళ చలిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవాళ (ఆదివారం) నంద్యాల జిల్లా ఆలమూరులో 40.3, కర్నూలు జిల్లా లద్దగిరిలో 39.6, వైఎస్ఆర్ కడప జిల్లా నల్లచెరువుపల్లిలో 39.4 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే సత్యసాయి జిల్లా కుటగుల్ల, పెనుకొండలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఎండలు పెరుగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Garimella Balakrishna Prasad: మూగబోయిన స్వరం.. టీటీడీ ఆస్థాన గాయకుడు ఇక లేరు..
Fire Accident: అంబులెన్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. చివరికి ఏం జరిగిందంటే..