జనసేన నాయకునిపై దాడి అమానుషం
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:34 AM
రామభద్రపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు మహంతి ధనుంజయ్పై ఆ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పాశవికంగా దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడడం క్షమించరానిదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గిరడ అప్పలస్వామి అన్నారు.

బొబ్బిలి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): రామభద్రపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు మహంతి ధనుంజయ్పై ఆ గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పాశవికంగా దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడడం క్షమించరానిదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గిరడ అప్పలస్వామి అన్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా కబ్జా చేసి, లావాదేవీలు జరపడాన్ని ధనుంజయ్ తీవ్రంగా వ్యతిరేకించి పలు పోరాటాలు చేశారన్నారు. ఆయనకు మద్దతుగా తాను కూడా నిలిచానని, సీపీఎం నాయకులు మద్దతు పలికారన్నారు. ఈ అక్రమ భూమి లావాదేవీలకు సంబంధించి హైకోర్టులో వ్యాజ్యం కూడా వేశామని తెలిపారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా వైసీపీ నాయకులు మళ్లీ బరితెగించి ఇలా దాడులకు దిగడం సభ్యసమాజం అంగీకరించబోదన్నారు. ధనుంజయ్పై దాడి చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధనుంజయ్కు పూర్తిస్ధాయి న్యాయం జరిగేవరకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.