తెలుగు సినిమాలకే ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:10 AM
ఎన్ని భాషల్లో అవకాశాలు వచ్చినా తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యం ఇస్తానని సినీ నటి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం.. మీనాక్షి చౌదరి స్పష్టం చేశారు.

త్వరలో నాగచైతన్యతో సినిమా
సినీ నటి మీనాక్షి చౌదరి
రాజాం రూరల్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఎన్ని భాషల్లో అవకాశాలు వచ్చినా తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యం ఇస్తానని సినీ నటి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం.. మీనాక్షి చౌదరి స్పష్టం చేశారు. తాను నటించిన సినిమాలన్నింటిలో ‘లక్కీ భాస్కర్’ ఎంతో గుర్తింపు తెచ్చిందన్నారు. ఆ చిత్రంలో సుమతి పాత్ర తనకెంతో ఇష్టమని, జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర అని మీనాక్షి వెల్లడించారు. ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం ఆమె రాజాం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో తన సినీ జీవితానికి సంబంధించిన వివిధ అంశాలను పంచుకున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు తనకూ ఎంతో గుర్తింపును తెచ్చిందన్నారు. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తనకు పాలోయింగ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్నానని, త్వరలో నాగచైతన్యతో సినిమా చేయబోతున్నట్టు మీనాక్షి ప్రకటించారు. నాగచైతన్యతో కలిసి నటించే అవకాశం రావడంతో ఎగ్జయిటింగ్గా ఉందన్నారు. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు మీనాక్షి పేర్కొన్నారు. సినిమా అవకాశాలతో పాటు స్ర్కిప్ట్ ఎంచుకునే వెసులుబాటు కలుగుతోందన్నారు. సినీ పరిశ్రమలో తన విజయం వెనుక కీలక పాత్ర తెలుగు ప్రేక్షకులదేనని మీనాక్షి చౌదరి స్పష్టం చేశారు.