Kadapa Police Arrest: మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషా అరెస్టు
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:04 AM
వైసీపీ నేత అంజద్బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. వివిధ క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి

ముంబై ఎయిర్పోర్టులో అదుపులోకి
టీడీపీ నేతపై దాడి సహా 6 కేసులు
నేడు కడపకు తీసుకురానున్న పోలీసులు
2022లో అప్పటి టీడీపీ నేతపై దాడిలో నాన్బెయిలబుల్ కేసు నమోదు
బాషాపై మరో ఐదు వేర్వేరు కేసులు
కడప, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప తాలూకా పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. 2022లో నగరంలోని వినాయకనగర్లో మినిస్టరు కాలనీ పేరిట అంజద్ బాషా కుటుంబ సభ్యులు లేఅవుట్ వేశారు. దీనికి అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. ఈ లేఅవుట్కు ఆనుకునే అప్పటి టీడీపీ నేత, ఇప్పుడు వైసీపీలో ఉన్న జమీల్కు స్థలం ఉంది. దీని విషయమై అహ్మద్బాషా జమీల్, అతడి వర్గంపై దాడి చేశారు. ఈ దాడిలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తికి కాళ్లు విరిగాయి. అహ్మద్బాషాపై కడప తాలూకా పోలీసుస్టేషన్లో నాన్ బెయిల్బుల్ కేసు (క్రైం నం.402/22) నమోదైంది. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు. ఇది కాకుండా ఆయనపై కడప చిన్నచౌకులో ఒకటి, టూ టౌన్లో మరో నాలుగు కేసులు ఉన్నాయి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో వీరి జోలికి ఎవరూ పోలేదు. ఇక.. ఎన్నికల సమయంలో ఇప్పటి హోంమంత్రి అనిత, అచ్చెన్నాయుడుపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా బాషా పోస్టులు పెట్టారు. వీటిపైనా కేసు నమోదైంది. ఎన్నికలకు ముందు అహ్మద్ బాషా ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్.మాధవిని, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై కూడా కేసు నమోదైంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక అహ్మద్బాషా సైలెంట్ అయిపోయారు.
ఎక్కువ కాలం గల్ఫ్లో ఉంటూ హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఇంకోవైపు.. ఆయనపై చిన్నచౌకు పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. రంజాన్ పండక్కి కడపకు వచ్చిన ఆయన తిరిగి గల్ఫ్ వెళ్లేందుకు ఐదురోజులుగా ముంబైలో ఉంటున్నారు. శనివారం రాత్రి గల్ఫ్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ముంబై ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అక్కడ సహారా పోలీసుస్టేషన్లో అప్పగించి కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజరాజేశ్వర్రెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడకు ఆయన్ను అదుపులోకి తీసుకుని బాంద్రా కోర్టులో హాజరుపరచింది. అక్కడి కోర్టు అనుమతితో సోమవారం కడపకు తీసుకురానున్నారు. ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ కార్యకర్తలు ఆదివారం కడపలో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆర్.శ్రీనివాసరెడ్డిని నాడు బాషా తీవ్ర పదజాలంతో దూషించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘అయిపాయ్.. పాపం పండింది’ అంటూ వైరల్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్