Tamilnadu BJP Chief: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి రేసులో ఆ నలుగురు
ABN , Publish Date - Apr 04 , 2025 | 07:13 PM
ఈనెల 8-10 తేదీల మధ్య కొత్త నేతను పార్టీ అధిష్టానం ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాజిక వర్గం, పార్టీ పట్ల విధేయత వంటివి సహజంగానే పరిగణనలోకి తీసుకోనున్నారు.

చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి రేసులో తాను లేనంటూ ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కె.అన్నామలై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆయన స్థానంలో ఎవరికి పార్టీ అధ్యక్షుడి పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈనెల 8-10 తేదీల మధ్య కొత్త నేతను పార్టీ అధిష్టానం ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాజిక వర్గం, పార్టీ పట్ల విధేయత వంటివి సహజంగానే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో నాలుగు పేర్లు ప్రమఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో తమిళిసై సౌందరరాజన్, నైనార్ నాగేంద్రన్, ఎల్.మురుగన్, వనతి శ్రీనివాసన్ ఉన్నారు.
Annamalai: బీజేపీ అధ్యక్షుడి రేసులో లేను.. అన్నామలై కీలక వ్యాఖ్యలు
1.తమిళిసై సౌందరరాజన్
తమిళనాడు బీజేపీ సీనియర్ నేతగా, పార్టీ విధేయురాలిగా తమిళిసై సౌందర్రాజన్కు పేరుంది. గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా, ఇటీవల వరకూ తమిళనాడు గవర్నర్గా ఆమె పనిచేశారు. 2024లో తిరిగి ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సౌత్ చెన్నై లోక్సభ సీటు నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి తమిళాచి తంగపాండియన్ చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో అనుభవం ఉన్నప్పటికీ గతంలో ఆమె రాష్ట్ర బీజేపీ అధక్షురాలిగా ఉన్నప్పుడు పార్టీకి పెద్దగా లాభించినది లేదనే చెప్పాలి. అయితే విధేయత, అందరికి తెలిసిన వ్యక్తినే పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేయదలచుకుంటే ఆమె ఈ పదవికి గట్టి పోటీదారుగానే చెప్పాలి.
2.నైనార్ నాగేంద్రన్
సీజన్డ్ పొలిటీషన్గా ఈయనకు పేరుంది. అటు అన్నాడీఎంకేతోనూ, ఇటు బీజేపీతోనూ ఆయనకు సాన్నిహిత్యం ఉంది. అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉంది. అన్నాడీఎంకే ప్రభుత్వంలో (2001-2006) మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2017లో ఆయన బీజేపీలో చేరారు. విద్యుత్, పరిశ్రమలు, రవాణా వంటి కీలక పదవుల్లో పనిచేశారు. తిరునల్వేలి నుంచి పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. గెలిచిన సందర్భాలతో పాటు ఓడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మార్వార్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు దక్షిణ తమిళనాడుతోనూ, మర్వార్ వర్గీయుల్లోనూ పలుకుబడి ఉంది. ఈ క్రమంలో ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉండొచ్చు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఆయనకు ప్రతికూలం కావచ్చు.
3.ఎల్.మురుగున్
రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్.మురుగున్ ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు అప్పగిస్తే దళిత ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించే అవకాశం మెండుగా ఉంటుంది. న్యాయవాది కావడం, ఆర్ఎస్ఎస్తో ఉన్న అనుబంధం ఆయనకు కలిసొచ్చే అంశాలు. బీజేపీ చీఫ్గా ఆయన 2020 నుంచి 2021 వరకూ పనిచేశారు. పార్టీని విస్తరించే ప్రయత్నాలు గట్టిగానే చేశారు. అయినప్పటికీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ధరపురం, 2024 లోక్సభ ఎన్నికల్లో నీలగిరి నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూశారు. అయితే హిందుత్వవాదిగా, దళిత ప్రతినిధిగా చూసినప్పుడు ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు అప్పగించే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి.
4.వనతి శ్రీనివాసన్
ప్రస్తుతం కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యేగా వనతి శ్రీనివాసన్ ఉన్నారు. తమిళనాడు బీజేపీ మహిళా నేతల్లో ప్రముఖులుగా ఆమెకు పేరుంది. పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా పార్టీకి సేవలందించారు. 2021లో ప్రముఖ నటుడు కమల్హాసన్పై గెలవడం ఆమెకు రాజకీయంగానూ మంచి గుర్తింపు తెచ్చింది. ఓబీసీ కావడం, సంస్థాగత అనుభవం కలిసొచ్చే అంశాలు.
ఇవి కూడా చదవండి..
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్
NEET Row: స్టాలిన్ సర్కార్కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి
PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..
For National News And Telugu News