Share News

Maoists: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు

ABN , Publish Date - Apr 06 , 2025 | 03:38 AM

మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం ఒకేరోజు ఏకంగా 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు.

Maoists: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు

  • వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు

  • అంతా ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌, సుక్మా జిల్లాల వారే

  • ఒక్కొక్కరికి రూ.25 వేల ప్రభుత్వ సాయం అందజేత

కొత్తగూడెం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం ఒకేరోజు ఏకంగా 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లో ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతుండడం, లొంగిపోయిన వారంతా ఆ రాష్ట్రంలోని బీజాపూర్‌, సుక్మా జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఆపరేషన్‌ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీజోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఎదుట భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీసుల సమక్షంలో వీరు లొంగిపోయారు. లొంగిపోయిన ఈ మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.25 వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు ఆపాలని పోలీసులు నిర్ణయించి స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా గడచిన నాలుగు నెలల్లో కొత్తగూడెం జిల్లాలో 203 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు, మరో 66 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగూడెం పోలీసు అధికారులు మావోయిస్టులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి లొంగిపోయేందుకు ఒప్పించారని, పోలీసులపై నమ్మకం ఏర్పడిన తరువాతనే వీరంతా లొంగిపోయారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ చేయూతకు ఆకర్షితులై మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్‌, ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్‌ పాల్గొన్నారు.


ఛత్తీ్‌సగఢ్‌ పోలీసుల తీరుతోనే..

చర్ల, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లో ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో కొనసాగుతున్న యుద్ధంతో దండకారణ్యం వార్‌జోన్‌గా మారింది. గత 21 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీకి వరుస ఎన్‌కౌంటర్లతో కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలో పనిచేస్తున్న మిలీషియా, దళ, డివిజన్‌, జిల్లా, దండకారణ్య, రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, కోబ్రా బలగాలు అడవుల్లోకి దూసుకుపోతున్నాయి. పోలీస్‌ క్యాంపులు పెట్టే క్రమంలో మావోయిస్టు పార్టీకి సహకరించే సభ్యులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు. దీంతో ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ, మహారాష్ట్రలోని మావోయిస్టు పార్టీ సభ్యులు పెద్దసంఖ్యలో లొంగిపోతున్నారు. అనుకూల పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల పోలీసుల వద్ద లొంగిపోతున్నారు. ముఖ్యంగా చత్తీ్‌సగఢ్‌ మావోయిస్టు పార్టీ సభ్యులు తెలంగాణలో లొంగుబాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ చేయూత’ కార్యక్రమమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇక్కడి ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు, సౌకర్యాలు వారిని ఆకర్షిస్తున్నట్లు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన సుమారు 120 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు తెలంగాణలో లొంగిపోయారు. ఏకపక్షంగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లు, అరెస్టులు కూడా ఈ లొంగుబాట్లకు కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే లొంగుబాట్ల విషయంలో ఛత్తీ్‌సగఢ్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా అక్కడి మావోయిస్టులు తెలంగాణకు రావడానికి కారణంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. లొంగిపోవడానికి ముందుకొచ్చేవారికి వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా విచారణ పేరుతో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తమకు అవసరమైన సమాచారం వచ్చేవరకూ వారి లొంగుబాటును నిర్ధారించడం లేదని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 06 , 2025 | 03:38 AM