Share News

ఫార్ములా-ఈ కేసులో నేడు గ్రీన్‌కో ఎండీ విచారణ

ABN , Publish Date - Jan 18 , 2025 | 04:37 AM

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, దాని మాతృసంస్థ గ్రీన్‌కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను శనివారం ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.

ఫార్ములా-ఈ కేసులో నేడు గ్రీన్‌కో ఎండీ విచారణ

  • చలమలశెట్టి అనిల్‌ను ప్రశ్నించనున్న ఏసీబీ

  • ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ పుట్టుక, అంతర్థానం వెనుక సంగతి

  • ఏమిటన్న దానిపై విచారించే అవకాశం!

  • బీఆర్‌ఎ్‌సకు రూ.41 కోట్ల ఎన్నికల బాండ్లు

  • ఫార్ములా-ఈ కథ మొదలైనప్పుడు రూ.31 కోట్లు

  • ఒప్పందానికి 15 రోజుల ముందు 10 కోట్ల బాండ్లు

  • కేటీఆర్‌కు అనిల్‌తో స్నేహం ఉందంటున్న కాంగ్రెస్‌

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, దాని మాతృసంస్థ గ్రీన్‌కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను శనివారం ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫార్ములా-ఈ కారు రేసు కేసు విచారణ ప్రారంభమయ్యాక ఏసీబీ అధికారులు ఇప్పటికే గ్రీన్‌కో, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, ఏస్‌ రేస్‌, ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు కీలక ఆధారాలు సేకరించారు. మరోవైపు చలమలశెట్టి అనిల్‌కుమార్‌కు, మాజీమంత్రి కేటీఆర్‌కు మధ్య సాన్నిహిత్యం ఉందని, అందుకే త్రైపాక్షిక ఒప్పందానికి ముందు గ్రీన్‌కో నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి రెండు విడతలుగా రూ.41 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు వచ్చాయని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌ వేదికగా 4 సెషన్లలో ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహించడం కోసం పురపాలకశాఖ, ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈవో), ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ మధ్య 2022 అక్టోబరు 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.


ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రమోటర్‌గా ఉంటూ 9, 10, 11, 12 సెషన్లకు సంబంధించిన ఫీజును ఎఫ్‌ఈవోకు చెల్లిస్తోంది. వాస్తవానికి ప్రమోటర్‌ పాత్రలో తెరపైకి వచ్చిన ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, దీని సిస్టర్‌ కంపెనీ ఏస్‌ రేస్‌కు స్పోర్టింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. ఈ కంపెనీలన్నింటిలో చలమలశెట్టి అనిల్‌కుమార్‌ కీలక హోదాల్లో ఉన్నారు. బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌ఈవోతో మాజీ మంత్రి కేటీఆర్‌ తొలి దఫా చర్చలు జరిపిన తర్వాత హఠాత్తుగా ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, ఏస్‌ రేస్‌ కంపెనీలను 2022 జూలైలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. రిజిస్ట్రేషన్‌కు 15రోజుల ముందే గ్రీన్‌కో నుంచి రూ.10 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు బీఆర్‌ఎస్‌ పార్టీకి అందాయి. అంతకు 2నెలల ముందు అదే సంస్థ నుంచి రూ.31 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు గులాబీ పార్టీకి వచ్చాయి. ఆ తర్వాతే ఏస్‌ నెక్ట్స్‌జెన్‌, ఏస్‌ రేస్‌ కంపెనీలు తెరపైకి రావడం, వీటిలో ఏస్‌ నెక్ట్స్‌జెన్‌కు ప్రమోటర్‌ హోదా దక్కడం జరిగింది.


ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ కంపెనీ.. ఎఫ్‌ఈవోకు చెల్లించాల్సిన ఫీజు కోసం అనిల్‌కుమార్‌ చలమలశెట్టికి చెందిన ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ నుంచి రూ.90 కోట్ల రుణం తీసుకుంది. ఈ విషయం ఇటీవలే ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. అయితే 10వ సెషన్‌ రేసు ప్రారం భం కావడానికి ముందే ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ వెనక్కి తగ్గింది. ఓవైపు ఫార్ములా-ఈ కారు రేసు వల్ల రూ. 700 కోట్ల వ్యాపారం జరిగిందని కేటీఆర్‌ చెబుతుంటే.. ఈ కంపె నీ రెండో సెషన్‌కు వెళ్లకుండా వెనక్కి తగ్గడానికి కారణమేంటన్న విషయంపై స్పష్టత కోసం ఏసీబీ అధికారులు యత్నిస్తున్నారు. ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ వెనక్కి తగ్గడం వల్లే రెండో ఒప్పందం జరగడం, ఒప్పందానికి ముందే రూ.45.71 కోట్లను హెచ్‌ఏండీఏ నిధుల నుంచి ఎఫ్‌ఈవోకి చెల్లింపులు జరిగాయి. అనిల్‌కుమార్‌ కంపెనీల నుంచి రూ.41 కోట్లు బాండ్ల రూపంలో అందడం వల్లే కేటీఆర్‌ ఈ కంపెనీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారా? అనే విషయాలను ఏసీబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jan 18 , 2025 | 04:37 AM