అంబేద్కర్ జయంతి ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:06 AM
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు.

సుభాష్నగర్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలపై పలు ప్రజా సంఘాల నాయకులు, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జయంతి ఉత్సవాలపై ఉత్సవ కమిటీ సభ్యులు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాటు చేయాలన్నారు. సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాసేవ చేసేవారికి అవార్డులు ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని, సాంస్కృతిక సారథి కళాకారుల బృందం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశం డీఆర్వో వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి పవన్కుమార్, ఆర్డీవో మహేశ్వర్, ప్రజా సంఘాల నాయకులు, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.