Mahbubnagar: ఉపాధ్యాయురాలు మందలించిందని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:58 AM
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 9వ తరగతి విద్యార్థిని, ఉపాధ్యాయురాలి మందలింపుతో మనస్తాపానికి గురై దగ్గు మందు, ఫినాయిల్, యాసిడ్ను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలో ఘటన
కోయిలకొండ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయురాలు మందలించిందని మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఓ 9వ తరగతి విద్యార్థిని అత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన సోమవారం జరిగింది. కోయిలకొండ కేజీబీవీలో 9వ తరగతి చదువుతోన్న విద్యార్థిని మధ్యాహ్నం పాఠశాల అవరణలో తిరుగుతుండగా లోపలికి రావాలని, మాట వినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తామని ఉపాధ్యాయురాలు గట్టిగా హెచ్చరించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని గ్లాసులో దగ్గు మందుతో పాటు ఫినాయిల్, ఓ చుక్క యాసిడ్ను కలుపుకొని తాగింది. వాసన రావడంతో తోటి విద్యార్థులు విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియజేశారు. వారు బాలికను జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి, తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్ఓ తెలిపారు. ఈ ఘటనపై తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ కేజీవీబీకి చేరుకొని విచారణ నిర్వహించారు.