‘ధరణి’లో లోపం.. వారికి వరం
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:27 AM
ధరణి పోర్టల్లో లోపాలు అధికారులకు వరంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభు త్వం ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా అనేకమంది వీఆర్వోల సహకారంతో పోర్టల్లో తమకు భూమి లేనప్పటికీ నమోదు చేసుకున్నారు.

ధరణి పోర్టల్లో లోపాలు అధికారులకు వరంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభు త్వం ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా అనేకమంది వీఆర్వోల సహకారంతో పోర్టల్లో తమకు భూమి లేనప్పటికీ నమోదు చేసుకున్నారు. వీఆర్వోలకు అంతోఇంతో ముట్టచెప్పి అప్పటి నుంచి రైతుబంధు పొందుతూనే ఉన్నారు. కేవలం 10 గుంటలు ఉన్న ఒక వ్యక్తికి 10 ఎకరాలు ఉన్నట్లుగా కూడా నమోదైంది. కొంతమంది రైతులకు 20 ఎకరాలు ఉంటే నాలుగు ఎకరాలు మాత్ర మే నమోదైంది. ఒక సర్వే నెంబర్లో 30 ఎకరాలు ఉండాల్సి ఉండగా 40 నుంచి 50 ఎకరాలు కూడా నమోదైంది. ప్రతీ ఊరిలో 100 ఎకరాలు అధికంగా నమోదైనట్లు తెలుస్తోంది. ఇలాంటి తప్పులు అధికారుల మామూళ్ల వసూలుకు ఆసరాగా మారాయి.
- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)
ధరణి నిబంధనల మేరకు స్లాట్బుక్ చేసుకుంటే అధికారులు రిజిస్ట్రేషన చేయాల్సిందే. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు చనిపోతే వారికున్న నలుగురు సంతానంలో ఎవరు ముందుగా స్లాట్బుక్ చేసుకుంటే వారి పేరు మీదే రిజిస్ట్రేషన చేసి పాస్బుక్లు అందజేస్తున్నారు. కొన్ని మండలాల్లో ప్రతి రోజూ 6 నుం చి 7 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా నూతనకల్, మద్దిరాల, మేళ్లచెర్వు, చింతలపాలెంలో ఒక్కో రోజు రిజిస్ట్రేషన్లు కూడా ఉండటం లేదు. మొత్తం మీద ప్రతిరోజూ జిల్లాలో 100 నుంచి 110 దాకా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సర్వే నెంబర్ తప్పుపడ్డా, బ్యాంకులో పాస్బుక్ ఉంటే ఎకరానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వర కు డిమాండ్ చేస్తున్నారు. ధరణి ఆపరేటర్ల ద్వారానే కొంతమంది తహసీల్దార్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ధరణి ఆపరేటర్లు సరిగా నమోదు చేయకపోవడంతో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. అప్పటి వీఆర్వోలు చేసిన తప్పిదాల మూలం గా కొంతమంది రైతులకు 20 ఎకరాలు కబ్జాలో ఉంటే 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పొందుతున్నారు.
భూభారతి చట్టం ఎప్పటి నుంచో..
ధరణిలో లోపాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను త్వరలో తీసుకురానుంది. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఈ చట్టం తీసుకువస్తున్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో సంబంధిత మండల ఆర్ఐలు స్వయంగా భూమిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో అక్రమాలకు చోటుఉండదు. అంతేకాక కబ్జాలో ఉన్న భూమిని కొలవడమే కాకుండా మ్యాప్ కూడా తీసుకురావాడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాగులో ఎవరుంటారో వారికే రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే పెద్దఎత్తున బోగస్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూమి లేకున్నా రైతు భరోసా తీసుకున్నారు. వారిని గుర్తించి ప్రభుత్వం తిరిగి రైతుబంధు సొమ్మును రికవరీ చేయాల్సి ఉంది. లేకుంటే భూమి లేని వారికి సైతం రైతు భరోసా ఇవ్వాల్సి వస్తోంది. ప్రభుత్వ భూములను కూడా గుర్తించి వాటికి సరిహద్దులు పెట్టాల్సి ఉంది. పలు గ్రామాల్లో ప్రభుత్వ భూమే కాకుండా అటవీ భూమి కూడా కబ్జాలకు గురైంది. వాటని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ప్రధానంగా మట్టంపల్లి, మేళ్లచెర్వు మండలాల్లో ప్రభుత్వ భూమి అనేక చేతులు మారింది. వేల ఎకరాలు పట్టాలు చేసుకొని విక్రయిస్తున్నారు. దీనిపై పెద్దరభస కూడా జరిగింది. రెవెన్యూ అదికారులు కూడా సస్పెండ్ గురయ్యారు.
భూభారతి చట్టం ఇంకా రాలేదు
ప్రభుత్వం భూభారతి చట్టం ఇంకా తీసుకురాలేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్ నడుస్తుంది. ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటాం.
- వేణుమాధవ్, ఆర్డీవో, సూర్యాపేట