Unseasonal Rain: గాలి, వడగళ్ల వాన బీభత్సం
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:40 AM
రాష్ట్రంలో గాలి, వడగాళ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ ఉండి, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భీకరమైన గాలులకు తోడు వర్షం, వడగళ్లు కురుస్తుండడంతో తీవ్రమైన పంట నష్టం జరుగుతోంది.

పంటలకు తీవ్ర నష్టం.. నేడు, రేపు వర్షసూచన
రైతులను ఆదుకుంటాం: మంత్రి సీతక్క
(ఆంధ్రజ్యోతి నెట్వర్క్): రాష్ట్రంలో గాలి, వడగాళ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ ఉండి, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భీకరమైన గాలులకు తోడు వర్షం, వడగళ్లు కురుస్తుండడంతో తీవ్రమైన పంట నష్టం జరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, మునగ, చిక్కుడు, కాకర తోటలకు భారీ నష్టం వాటిల్లింది. రైతులు ఎండబెట్టుకున్న మిర్చి కుప్పలు ఎగిరిపోయాయి. పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా, విద్యుత్ స్తంభాలు విరిగిపోయి లైన్లు తెగిపోయాయి. దాంతో పలు గ్రామాలు అంధకారంతో కొట్టుమిట్టాడాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పలు చోట్ల రహదారులకు అడ్డంగా భారీ వృక్షాలు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కాగా, నాలుగైదు రోజుల్లో పంట చేతికొస్తుందన్న ఆశతో ఉన్న అన్నదాతలకు గాలిదుమారం, వడగళ్ల వాన తీరని నష్టాన్ని మిగిల్చాయి.
ఈ నేపథ్యంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. తడిసిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. పంటనష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీచేశారు. కాగా, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here