వరిలో పాముపొడ తెగులు
ABN , First Publish Date - 2020-11-04T05:08:40+05:30 IST
అధిక వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురైన వరి పైరును పాముపొడ తెగులు ఆశించిందని, రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని బీసీటీ-కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త బి.నాగేంద్రప్రసాద్ సూచించారు.

సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్త నాగేంద్రప్రసాద్ సూచన
రాంబిల్లి, నవంబరు 3: అధిక వర్షాలు, వరదల వల్ల ముంపునకు గురైన వరి పైరును పాముపొడ తెగులు ఆశించిందని, రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని బీసీటీ-కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త బి.నాగేంద్రప్రసాద్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని కుమ్మరాపల్లి, రజాల, మామిడివాడ; ఎస్.రాయవరం మండలం వేమగిరి, వెలమపాలెం గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించారు. అన్నిచోట్లా పాముపొడ తెగులు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ తెగులు కారణంగా ధాన్యం దిగుబడి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతుందన్నారు. ఇప్పటికే ప్రొపికోనజోల్ లేద హెక్సాకోనజోల్ మందును పిచికారీ చేసి 20 రోజులు దాటితే.... మందును మార్చి మరోసారి పిచికారీ చేయాలని సూచించారు. కాగా టెబ్యుకోనజోల్ + అజాక్సి స్త్రోబిన్ మందు ఎకరానికి 300 మిల్లీలీటర్లు లేదా టెబ్యుకొనజోల్ + ట్రైప్లాక్సి స్త్రోబిన్ మందు ఎకరానికి 160 గ్రాములను నీటిలో కలిపి పిచికారీ చేయాలని, దీనివల్ల 20 నుంచి 30 రోజుల వరకు పాముపొడ, పొట్టకుళ్లు, మానిపండు, అగ్గితెగులు, గోధుమ మచ్చ వంటివి సోకవని ఆయన చెప్పారు.