పాటిగడ్డ మీద సిద్దిపేట చరిత్ర

ABN , First Publish Date - 2021-03-18T05:09:15+05:30 IST

మాతంగి వాగు ఒడ్డున పుట్టి పెరిగిన ఊరు సిద్దిపేట. జిల్లా కేంద్రమైన సిద్దిపేటకు ఆ పేరు ఎట్లా వచ్చిందన్న దానికి పెద్దమనుషులు చెప్పిన కైఫీయతులే మిగిలాయి.

పాటిగడ్డ మీద సిద్దిపేట చరిత్ర
పాటిగడ్డ మీద దొరికిన చారిత్రక అవశేషాలు

నిజాం సైన్యంలోని సిద్ధిఖ్‌లు  ఏర్పరచుకున్న స్థావరమే సిద్దిపేట

నేడు పారుపల్లివీధి అని పిలిచే ప్రాంతంలోనే పారిన మాతంగి వాగు


సిద్దిపేట, మార్చి 17 : మాతంగి వాగు ఒడ్డున పుట్టి పెరిగిన ఊరు సిద్దిపేట. జిల్లా కేంద్రమైన సిద్దిపేటకు ఆ పేరు ఎట్లా వచ్చిందన్న దానికి పెద్దమనుషులు చెప్పిన కైఫీయతులే మిగిలాయి. చారిత్రక ఆధారాలుగా మిగిలిన గుళ్లున్నయి. సాహిత్యంలో పెద్దగా సిద్దిపేటను గురించి రాసిన సంగతులేం లేవు. కానీ సిద్దిపేట నగరంలో కనిపించే చార్‌ కమాన్ల నడుమ ఏర్పడ్డదే కొత్త పట్నం. నిజాం సైన్యంలోని సిద్ధిఖ్‌లు ఇక్కడ ఏర్పరచుకున్న శిబిరమే సిద్దిపేటగా మారిందన్నది ఒక కథ. ఇటీవల సిద్దిపేట సమీపంలోని మిట్టపల్లిలో దొరికిన ఆధారాల వల్ల మహారాష్ట్ర నుంచి 250 ఏళ్ల కింద ఈ ప్రాంతానికి వచ్చి నిజాం మాన్యాలు పొందిన సోమయాజులు సిద్ధోయి కుటుంబం 40 గ్రామాలను పాలించే అధికారం, రెవెన్యూ వసూలు అధికారాన్ని పొందింది. అప్పటి గ్రామాల్లో సిద్దిపేట పేరు లేదు. సిద్ధోయిల కాలంలో సిద్దిపేట వెలసిందేమోనని తెలంగాణ చారిత్రక పరిశోధకులు రామోజు హరగోపాల్‌ తెలిపారు. వెయ్యేళ్ల కింద కళ్యాణి చాళుక్యుల కాలంలో, 700 ఏళ్ల కింద కాకతీయుల ఏలుబడిలో, తర్వాత లభించిన శాసనాల్లో ఎక్కడా సిద్దిపేట ప్రస్తావన లేదు. 

సిద్ధులున్న ప్రాంతం కనుకనే సిద్ధులపేట

సిద్ధులున్న ప్రాంతం కనుకనే సిద్ధులపేట అయిందనే పౌరాణికగాథ ఒకటి చెప్పుకుంటారు. సిద్దిపేటలో పురాతనమైన పేట పారుపల్లి. పారుపల్లివీధి అని పిలిచే ప్రాంతంలోనే మాతంగి వాగు పారేది. ఆ వాగు ఒడ్డుననే పురాతన భోగేశ్వరాలయం, శివాలయం, రామాలయం మొదలైనవి ఉన్నాయి. భోగేశ్వరాలయం సమీపంలో పాతవనిపించే అమ్మదేవతల శిల్పాలు దొరికాయి. 

మామిండ్లోల్లబాయి దగ్గర లభ్యమైన ఆధారాలు

ఇప్పుడు కొత్తగా మాతంగివాగు ఒడ్డున, సిద్దిపేటకు ఉత్తరాన మామిండ్లోల్లబాయి దగ్గర పాటిగడ్డమీద కొత్త చారిత్రక ఆధారాలు లభించాయి. వేముగంటి మురళీకృష్ణ, వేముగంటి రఘునందన్‌, అహోబిలం కరుణాకర్‌, సామలేటి మహేశ్‌, మామిండ్లబాయి లక్ష్మారెడ్డి, చంటితో కలిసి (కొత్త తెలంగాణ చరిత్ర బృందం) అన్వేషించినట్లు హరగోపాల్‌ పేర్కొన్నారు. ఈ అన్వేషణలో మామిండ్లోల్లబాయి దగ్గర శాతవాహనులకాలం నాటి కుండపెంకులు, మట్టిపూసలు, పాలరాయిగోళి, ఇటుకలు, కొన్ని మధ్య రాతియుగంనాటి రాతి పనిముట్ల అవశేషాలు దొరికాయన్నారు. ఇవి సిద్దిపేటలో వేల యేళ్ల కిందనే మాతంగి వాగు ఒడ్డున మానవాసాలున్నాయని తెలిపే చారిత్రకాధారాలని హరగోపాల్‌ వెల్లడించారు.



Updated Date - 2021-03-18T05:09:15+05:30 IST