Share News

BJP MP Laxman: ప్రవళికది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య

ABN , First Publish Date - 2023-10-14T20:49:36+05:30 IST

గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళికది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) అన్నారు.

BJP MP Laxman:  ప్రవళికది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య

హైదరాబాద్: గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళికది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) అన్నారు. శనివారం నాడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ గ్రూప్ పరీక్షలను సరిగ్గా నిర్వహించకుండా, లీకేజీలతో నిరుద్యోగులతో సీఎం కేసీఆర్ ఆటలాడుతున్నారు. విద్యార్థులు పరీక్షల రద్దుతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమ్మాయి ఆత్మహత్య స్థలంకి అర్థరాత్రి కూడా వేలాది మంది ఆవేదనతో వచ్చారు. పోలీసు అధికారుల తీరు మరింత దారుణంగా ఉంది. ప్రవళిక కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయాలి. 30 లక్షల మంది యువకులు 9 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రి కేటీఆర్ బాధ్యతారహితంగా, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. తానే న్యాయమూర్తిగా తీర్పినిస్తున్నాడు. 70 మందిని టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో అరెస్ట్ చేశారు. ఒక్కరో ఇద్దరో లీక్ చేశారని అనడం మరింత దారుణం. రైతు ఆత్మహత్యల్లో నంబర్ వన్ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటే పొడుసుకొచ్చినట్లు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ కుటుంబాన్ని ఓఒదార్చకుండా, స్పందించకుండా , పరామర్శించకుండా రాజకీయం కోసం మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మాత్రం వెళ్లాడు. పోస్టుమార్టం రాకముందే ఎందుకు మృతదేహాన్ని ప్రవళిక స్వస్థలానికి తరలించారు. చనిపోయిన అమ్మాయి మీదనే పోలీసులు ఆరోపణలు చేయడం మరింత దారుణం’’ అని ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ్మాయి మీద నెపం నెడుతారా..?

‘‘మీరే న్యాయమూర్తుల? పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాకముందే అమ్మాయి మీద నెపం నెడుతారా..? పోలీసులు ఉద్యోగం చేస్తున్నారా అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారా..? పోలీసులు విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేయడం, అరెస్ట్ చేయడం ఏంటి ఇదేం వ్యవహారం. నిరుద్యోగుల్లో ప్రవళికదే చివరి ఆత్మహత్య కావాలని వేడుకుంటున్నాను. గజ్వేల్‌లో యువకుడు, సిరిసిల్లలో, సిద్దిపేటలో కూడా యువకులు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు. ఓట్ల కోసం ఊర్ల మీద పడ్డారు.. కానీ నిరుద్యోగులకు భరోసా ఇవ్వరెందుకు? ఒక్కరిద్దరి వల్ల టీఎస్పీఎస్సీ (tspsc) పేపర్ లీక్ అన్న మంత్రి కేటీఆర్ ఇప్పుడు 70 మందిని ఎందుకు అరెస్ట్ చేశారు. ఎందుకు వాళ్ల మీద అంత మమకారం, ఏం ముడుపులు అందుతున్నాయి. 39 శాతం ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిశ్వల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 80000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. అలాగే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఆరెండు హామీలను తుంగలో తొక్కారు. బీజేపీ ప్రవళిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుంది. మీ పతనానికి ప్రవళిక మరణం కారణం కాబోతున్నది. బీజేపీ అధికారంలోకి రాగానే జ్యాబ్ కాలెండర్ ప్రకటిస్తాం. మోదీ సర్కారు లాగా స్కిల్, ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తాం. కల్వకుంట్ల కుటుంబానికి ఇదే చివరి ఎన్నిక కావాలి. విద్యార్థులు బీఆర్ఎస్ ప్రభుత్వానన్ని గద్దెదింపాలి. చనిపోయిన అమ్మాయి మీద అపవాదు వేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను కలుస్తాం’’ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-14T20:49:36+05:30 IST