Share News

వైసీపీకి ఓట్లు వేయలేదని రస్తా మూసేశారు...

ABN , Publish Date - Sep 02 , 2024 | 11:06 PM

గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయలేదని అ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఎంతో కాలంగా ఉన్న బండ్ల రస్తాను మూసివేశారని దిగువగొట్టివీడు గ్రామం జంగంపల్లి గ్రామ ప్రజలు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

వైసీపీకి ఓట్లు వేయలేదని రస్తా మూసేశారు...
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు

వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా గ్రామస్తుల ధర్నా

రాయచోటి (కలెక్టరేట్‌), సెప్టెంబరు 2: గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేయలేదని అ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఎంతో కాలంగా ఉన్న బండ్ల రస్తాను మూసివేశారని దిగువగొట్టివీడు గ్రామం జంగంపల్లి గ్రామ ప్రజలు సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. చిన్నమండెం మండలం దిగువగొట్టివీడు గ్రామం జంగంపల్లెకు పక్కనే గాలివీడు మండలం ఎగువగొట్టివీడు గ్రామం ఉంది. ఈ గ్రామంలో జంగంపల్లె వాసులకు చెందిన 100 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. అ భూముల్లో వ్యవసాయం చేయడానికి జంగంపల్లి నుంచి తమ భూముల్లోకి వెళ్లడానికి పూర్వం నుంచి బండ్ల జాగా ఉండేదని, ఎన్నికల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ఓట్లు వేయలేదని ఆయన అనుచరులు సుదర్శన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాధరెడ్డి, మరికొందరు కలిసి రస్తాను మూసివేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పొలాల్లోకి వెళితే మీ అంతు చూస్తాం అని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. నిరసన అనంతరం జంగంపల్లి ప్రజలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని గ్రామస్తులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి దృష్టికి కూడా తీసుకెళ్లారు. దారి విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్‌కు చెప్పినట్లు తెలిసింది. కార్యక్రమంలో గ్రామస్తులకు మద్దతుగా టి.ఈశ్వర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి రామాంజులు, పల్లం తాతయ్య, జంగంపల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 11:06 PM