Share News

హెచ్‌సీజీ గూటికి వైజాగ్‌లోని క్యాన్సర్‌ ఆసుపత్రి

ABN , Publish Date - Jun 30 , 2024 | 01:01 AM

దేశంలో అతిపెద్ద క్యాన్సర్‌ కేర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌(హెచ్‌సీజీ)..

హెచ్‌సీజీ గూటికి వైజాగ్‌లోని క్యాన్సర్‌ ఆసుపత్రి

డీల్‌ విలువ రూ.414 కోట్లు

విశాఖపట్నం: దేశంలో అతిపెద్ద క్యాన్సర్‌ కేర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌(హెచ్‌సీజీ).. వైజాగ్‌కు చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎంజీసీహెచ్‌ఆర్‌ఐ)ను రూ.414 కోట్ల ఎంటర్‌ప్రైస్‌ విలువకు కొనుగోలు చేసింది. ఎంజీసీహెచ్‌ఆర్‌ఐలో హెచ్‌సీజీ తొలుత 51 శాతం వాటాను దక్కించుకోనుంది. ఆ తర్వాత 18 నెలల్లో మరో 34 శాతం వాటాను చేజిక్కించుకోనుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎంజీసీహెచ్‌ఆర్‌ రూ.120.2 కోట్ల ఆదాయంపై రూ.42.2 కోట్ల స్థూల లాభాన్ని గడించింది. ప్రముఖ ఆంకాలజీ సర్జన్‌ డాక్టర్‌ మురళీ కృష్ణ వూన్న 1986లో ఎంజీసీహెచ్‌ఆర్‌ఐని ప్రారంభించారు. 196 పడకల సామర్థ్యం తో కూడిన ఈ ఆసుపత్రి.. 2 లినాక్‌ మెషీన్స్‌, ఒక పెట్‌ సిటీ స్కానర్‌, ఒక రోబోటిక్‌ సర్జరీ సిస్టమ్‌, డెడికేటెడ్‌ బోన్‌ మారోవ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ యూనిట్‌ వంటి అత్యాధునిక మౌలిక వసతులను కలిగి ఉంది. కాగా, హెచ్‌సీజీ భారత్‌, ఆఫ్రికాలో కలిపి 21 ఆసుపత్రులను నిర్వహిస్తోంది.

Updated Date - Jun 30 , 2024 | 01:01 AM