Share News

National : హరియాణాలో.. బీజేపీకి విషమ పరీక్షే!

ABN , Publish Date - May 25 , 2024 | 03:09 AM

హరియాణాలో అక్టోబరు-నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

National : హరియాణాలో..  బీజేపీకి విషమ పరీక్షే!

హరియాణాలో అక్టోబరు-నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గత మార్చిలో జేజేఎం మద్దతు ఉపసంహరణతో బీజేపీ ఆ పార్టీ రెబెల్స్‌ తోడ్పాటుతో అత్తెసరు మెజారిటీతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీకి.. ఇప్పుడు విషమ పరీక్ష ఎదురవుతోంది. కుల సమీకరణలు, అగ్నివీర్‌ స్కీం, మద్దతు ధర కోసం రైతుల ఆందోళన ఆ పార్టీకి సవాల్‌ విసురుతున్నాయి. దీనికితోడు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ జట్టుకట్టాయి. బీజేపీ పది స్థానాల్లోనూ పోటీచేస్తుండగా.. కాంగ్రెస్‌ 9, ఆప్‌ ఒక చోట బరిలో ఉన్నాయి. ఈ పది స్థానాలకు ఆరో విడతలో శనివారం (25న) పోలింగ్‌ జరుగనుంది. పార్టీల బలాబలాలను శక్తిమంతులైన జాట్‌లు నిర్దేశించనున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర జనాభాలో వీరు 24ు వరకు ఉన్నారు. రైతుల్లోను, సైనిక బలగాల్లోనూ వీరే ఎక్కువ మంది ఉన్నారు. వీరు అగ్నివీర్‌ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మద్దతు ధర కల్పనపై చట్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో రెజ్లర్లు ఉద్యమించిన పరిణామం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపీందర్‌సింగ్‌ హూడా జాట్‌ వర్గీయుడే కావడంతో అత్యధికులు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. ఇక జేజేఎం అధినేత దుష్యంత్‌ చౌతాలా జాట్‌ నేత. ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. మరోవైపు, పంజాబీ అయిన మనోహర్‌ ఖట్టర్‌ను ఆ పార్టీ అధిష్ఠానం గత మార్చిలో సీఎం పదవి నుంచి తప్పించి ఓబీసీ నేత నాయబ్‌ సైనీని ఆయన స్థానంలో నియమించింది. ఆరుగురు సిటింగ్‌ ఎంపీలకు బీజేపీ ఈసారి టికెట్లు ఇవ్వలేదు. జాట్‌, బ్రాహ్మణులు, ఎస్సీలకు రెండేసి టికెట్లు ఇచ్చారు. 9 సీట్లలో పోటీచేస్తున్న కాంగ్రెస్‌.. ముగ్గురు జాట్‌లను బరిలోకి దించింది. భూపీందర్‌ హూడా తనయుడు దీపేందర్‌ హూడా రోహతక్‌లో ప్రస్తుత బీజేపీ ఎంపీ అరవింద్‌ శర్మతో తలపడుతున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు అశోక్‌ తన్వర్‌ ఈసారి బీజేపీ తరఫున సిర్సా (ఎస్సీ)లో పోటీచేస్తున్నారు. ఆయనతో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు కుమారి సెల్జా తలపడుతున్నారు. కురుక్షేత్రలో పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ ఈసారి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయనపై ఆప్‌ తరఫున సుశీల్‌కుమార్‌ గుప్తా, ఐఎన్‌ఎల్‌డీ నుంచి అభయ్‌ చౌతాలా బరిలో ఉన్నారు. - సెంట్రల్‌ డెస్క్‌.

Updated Date - May 25 , 2024 | 03:09 AM