Share News

Rahul Gandhi : లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు!

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:22 AM

భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే బీజేపీ 240 సీట్లకు దరిదాపుల్లో కూడా వచ్చేది కాదన్నారు.

Rahul Gandhi : లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు!

  • ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది

  • కాంగ్రెస్‌ ఖాతాలను సీజ్‌ చేశారు

  • బడా వ్యాపార్లతో మోదీ కుమ్మక్కు

  • ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 240కూడా వచ్చేవి కావు

  • భారత్‌లో సిక్కులకు తలపాగా ధరించే హక్కూ లేదు: రాహుల్‌

  • దేశ ప్రతిష్ఠ మంటగలుపుతున్నరు

  • ప్రతిపక్ష నేతపై మండిపడ్డ బీజేపీ

  • ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది

  • భారత్‌లో హక్కుల కోసం ఘర్షణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే బీజేపీ 240 సీట్లకు దరిదాపుల్లో కూడా వచ్చేది కాదన్నారు. అమెరికాలోని జార్జిటౌన్‌ యూనివర్సిటీలో మంగళవారం విద్యార్థులతో జరిగిన సమావేశంలో రాహుల్‌ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు 3నెలల ముందు తమ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారన్నారు. ఫలితంగా బీజేపీకి లబ్ధి కలిగిందని, ఎన్నికల సంఘం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. రెండు మూడు బడా వ్యాపార సంస్థలతో మోదీ ప్రభుత్వం కుమ్మక్కైందన్నారు. ఎన్నికలకు ముందు మోదీ భయాన్ని వ్యాపింపజేశారని.. ఎన్నికల తర్వాత ప్రజలకు భయం పోయిందని అన్నారు. 56 అంగుళాల ఛాతీ, దేవుడితో నేరుగా సంబంధాలు ఉన్నాయని చెప్పుకొన్న మోదీ.. ఎన్నికల తర్వాత నీరుగారిపోయారని ఎద్దేవా చేశారు. తాను మోదీని ద్వేషించనని, ఆయన ఆలోచనా విధానాన్ని వ్యతిరేకిస్తానని రాహుల్‌ తెలిపారు. భారతదేశంలో రాజకీయాల మధ్య ఘర్షణ జరగడం లేదని, ప్రాథమిక హక్కుల గురించి జరుగుతోందని చెప్పారు. ఒక సిక్కు తన తల పాగా, కాడాను ధరించేందుకు అనుమతిస్తారా? అన్న దానిపై వివాదం ఉందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం సిక్కులకే కాదని, అన్ని మతాలవారికీ వర్తిస్తుందని అన్నారు.


  • ఓబీసీ, దళితులకు భాగస్వామ్యం లేదు..

రాజ్యాంగాన్ని పరిరక్షించేవారికి, దాన్ని ధ్వంసం చేసేవారికి మధ్య జరిగిన పోరుగా పేదలు తాజా లోక్‌సభ ఎన్నికలను అర్థం చేసుకున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కులగణన కూడా ఒక మౌలిక అంశంగా మారిందన్నారు. భారత్‌ ఒక మంచి దేశంగా మారినప్పుడు రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని తెలిపారు. ఓబీసీ, దళితులకు సమాజంలో భాగస్వామ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంద రూపాయల్లో ఆదివాసీలకు పది, దళితులు, ఓబీసీలకు 5 రూపాయలు మాత్రమే దక్కుతున్నాయన్నారు. అదానీ, అంబానీలకు లభించిన ప్రయోజనాలే అందరికీ దక్కినప్పుడే జనరల్‌ కేటగిరీలో ఉన్నవారికి లబ్ధి చేకూరుతుందని.. అయితే అందుకు అవసరమైన మార్గాలను మూసేశారని అన్నారు.


  • యూనియన్‌ అంటే బీజేపీ ఒప్పుకోదు

రాజ్యాంగంలో భారతదేశం ఒక యూనియన్‌ అని ఉందని.. బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోదని రాహుల్‌ చెప్పారు. దేశంలో కొన్ని రాష్ట్రాల కంటే కొన్ని రాష్ట్రాలు తక్కువ అని, కొన్ని భాషల కంటే ఇంకొన్ని భాషలు తక్కువ అని.. కొన్ని మతాల కంటే మరికొన్ని మతాలు గొప్పవని ఆరెస్సెస్‌ చెబుతోందని ఆరోపించారు. తమిళం, మరాఠీ, బెంగాలీ, మణిపురి.. ఇవన్నీ తక్కువ ప్రమాణాలు కలిగిన భాషలని అంటోందని.. ఆ సంస్థకు భారతదేశం అర్థం కాదని, ఇక్కడే తగువు మొదలవుతుందని రాహుల్‌ చెప్పారు. దేశంలో ఆర్థిక, సంస్థాగత సర్వేతో పాటు సమగ్ర కులజనగణన జరగాల్సిందేనని పేర్కొన్నారు.

  • రాహుల్‌వి దేశద్రోహ వ్యాఖ్యలు..

రాహుల్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో భారతదేశ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు. సిక్కులను ఇక్కడ తలపాగాలు ధరించేందుకు అనుమతించరన్న రాహుల్‌ వ్యాఖ్యల్లో నిజం లేదని కేంద్ర మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి అన్నారు. తాను ఆరు దశాబ్దాలుగా తలపాగాను ధరిస్తున్నానని చెప్పారు. 1947 తర్వాత తొలిసారి మోదీ హయాంలోనే సిక్కులు సురక్షితంగా ఉన్నారన్నారు. రాహుల్‌ గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే సిక్కులు అభద్రతతో బతికారని గుర్తుచేశారు. 1984లో సిక్కులను ఊచకోత కోశారని, 3 వేలమంది ప్రాణాలు బలిగొన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన సిక్కుల ఊచకోతను రాహుల్‌ ఎలా మరిచిపోయారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలోనే సిక్కుల తలపాగాలను తీసి తనిఖీ చేశారని, ఎందరో సిక్కుల గడ్డాలను కత్తిరించారని చెప్పారు. విదేశాల్లో భారతదేశ ప్రతిష్ఠను దిగజార్చడం దేశద్రోహమేనని కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు.

Updated Date - Sep 11 , 2024 | 06:54 AM