Share News

Rythu Runa Mafi: రెండో విడత రుణ మాఫీ నేడు!

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:10 AM

రెండో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Rythu Runa Mafi: రెండో విడత రుణ మాఫీ నేడు!

  • లక్ష-లక్షన్నర మధ్య ఉన్న మొత్తాలు మాఫీ

  • ఏడు లక్షల మంది రైతులకు ప్రయోజనం

  • వీరి ఖాతాలకు రూ.6,500 కోట్ల నగదు బదిలీ

  • అసెంబ్లీలో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం

  • జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

  • మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిధులు జమ

  • అసెంబ్లీలో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం

హైదరాబాద్‌, జులై 29 (ఆంధ్రజ్యోతి): రెండో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే సమయంలో వివిధ జిల్లా కలెక్టరేట్లలో ఆ జిల్లా కలెక్టర్లు రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. లక్షన్నర లోపు బకాయిలు ఉన్న సుమారు 7 లక్షల మంది రైతులకు మంగళవారం రూ.6,500 కోట్లు విడుదల చేయనున్నారు. లక్ష రూపాయల వరకు ఈ నెల 18 న రుణమాఫీ చేసిన ప్రభుత్వం... లక్షన్నర కేటగిరీలో ఉన్న రైతులకు ఈ నెలాఖరు లోపు రుణమాఫీ చేస్తామని అప్పుడే ప్రకటించింది. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ చేపట్టింది.


ఈ నెల 15న జీవో నెంబరు- 567 జారీచేసే నాటికే రూ.10 వేల కోట్లు సర్దుబాటు చేసింది. తొలి విడతలో 11.50 లక్షల మంది రైతులకు రూ.6,099 కోట్లు విడుదల చేసింది. మిగిలిన నిఽధులకు తోడుగా ఈనెల 23 న రూ.3 వేల కోట్లు రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తీసుకుంది. దీంతో ఖజానాలో రూ.7 వేల కోట్ల వరకు పోగయ్యాయి. రెండో విడతకు ఈ నిధులు సరిపోతాయనే ఉద్దేశంతో మంగళవారం పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్‌ సెంటర్‌లో డేటా ప్రాసెసింగ్‌ సమాచారం ప్రకారం... లక్ష, లక్షన్నర మధ్య అప్పున్న రైతులు సుమారు 7 లక్షల మంది ఉన్నారు. వారికి రూ.6,500 కోట్లు సరిపోతాయని అంచనా వేశారు. రూ.6,500 కోట్లకు సంబంధించిన బిల్లులను సోమవారం సాయంత్రం ట్రెజరీకి సమర్పించారు. వ్యవసాయ శాఖ ప్రొసీడింగ్స్‌ను కూడా జారీ చేసింది. రైతులు, వారి ఖాతాలు, జమచేసే నిధుల వివరాలను ట్రెజరీకి అందజేసింది. మంగళవారం ఉదయానికి సర్వం సిద్ధం చేసి.. 11.45 నుంచి 12 గంటల మధ్య లాంఛనంగా నగదు బదిలీ ప్రారంభిస్తారు.


కొంతమంది రైతులను అసెంబ్లీకి పిలిపిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వారికి డమ్మీ చెక్కులు పంపిణీ చేస్తారు. అదే సమయంలో జిల్లా కేంద్రాల్లో ఉన్న కలెక్టర్‌ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్లు రైతులకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరోవైపు కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రుణమాఫీ లబ్ధిదారులు, రైతులు, పార్టీ కార్యకర్తలతో సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడతలో అర్హులైన రైతుల జాబితాను మంగళవారం ఉదయమే వ్యవసాయ శాఖ వెల్లడించనుంది. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం 11.50 లక్షల రైతులకు రూ. 6,099 కోట్లు విడుదల చేయగా... 11.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,014 కోట్లు జమ అయ్యాయి. సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన రూ.84.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదు.


ఆర్‌బీఐ సూచించిన వివరాల మేరకు సాంకేతిక సమస్యలు సరిచేసి... ఆర్‌బీఐ నుంచి నిధులు వెనక్కిరాగానే తిరిగి ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక వాణిజ్య బ్యాంకులకు అనుసంధానంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(సీడెడ్‌ సొసైటీలకు) సంబంధించిన రైతుల రుణ ఖాతాలపై తనిఖీలు పూర్తి చేశారు. ఈ నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మంగళవారం తర్వాత రెండు విడతల్లో కలిపి 18.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,600కోట్లను రుణమాఫీ కింద జమచేసినట్లు అవుతుంది. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్య అప్పున్న రైతులకు ఆగస్టు నెలలో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి కల్వకుర్తి సభలో తాజాగా ప్రకటించారు. మూడో విడతలో రైతుల సంఖ్య, అవసరమయ్యే నిధులురెండో విడతకు రెట్టింపు ఉండే అవకాశాలున్నాయి.


6.jpg

  • రుణమాఫీ కార్యక్రమం.. రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, జూలై 29(ఆంఽధ్రజ్యోతి): లక్షన్నర రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీచేసే కార్యక్రమాన్ని మంగళవారం శాసనసభ ప్రాంగణంలో సీఎం రేవంత్‌ చేతుల మీదుగా నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయటానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రూ. లక్ష వరకు జరిగిన రుణమాఫీలో సందేహాలు ఉన్న రైతులు, అక్కడ ఉన్న అధికారులు, బ్యాంకర్లతో నివృత్తి చేసుకోవాలని, ఆ తర్వాత లక్షన్నర వరకు జరిగే రుణమాఫీ కార్యక్రమాన్ని వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో రెండు పర్యాయాలు జరిగింది రుణమాఫీ కాదని, వడ్డీ మాఫీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. కానీ తమది చేతల ప్రభుత్వమని, ఇప్పటికే రుణమాఫీలో రెండో విడతకు చేరుకున్నామని, వచ్చే నెలలో 2 లక్షల వరకు కూడా మాఫీ చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - Jul 30 , 2024 | 08:04 AM