Share News

Jani Master: జానీ మాస్టర్‌పై..లైంగిక దాడి కేసు

ABN , Publish Date - Sep 17 , 2024 | 03:29 AM

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(షేక్‌ జిలానీ బాషా)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్‌ తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ.. ఆయన వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల వయసున్న యువతి తొలుత మహిళా భద్రత విభాగం డీజీ శిఖా గోయెల్‌కు ఫిర్యాదు చేశారు.

Jani Master: జానీ మాస్టర్‌పై..లైంగిక దాడి కేసు

  • పెళ్లి పేరుతో మతం మారాలన్నాడు

  • సినిమాల్లో చాన్సుల్లేకుండా చేస్తున్నాడు

  • అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు

  • కేసు నమోదు చేసిన పోలీసులు

  • జనసేన సీరియస్‌ యాక్షన్‌

  • పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని జానీకి

  • ఆదేశాలు.. ఫిల్మ్‌చాంబర్‌ విచారణ షురూ

నార్సింగ్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌(షేక్‌ జిలానీ బాషా)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. జానీ మాస్టర్‌ తనను లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ.. ఆయన వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల వయసున్న యువతి తొలుత మహిళా భద్రత విభాగం డీజీ శిఖా గోయెల్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె సూచనల మేరకు రాయదుర్గం ఠాణాకు చేరుకుని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అయితే.. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధి కాకపోవడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. కేసును నార్సింగ్‌ ఠాణాకు బదిలీ చేశారు. నార్సింగ్‌ పోలీసులు లైంగిక దాడి, వేధింపులు, రక్తగాయాలయ్యేలా దాడి చేయడం వంటి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం.. 2017లో ఓ కాంటె్‌స్టలో పాల్గొనే అవకాశం వచ్చిన బాధితురాలు.. హైదరాబాద్‌కు వచ్చారు. 2019 నుంచి జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ముంబైలో షూటింగ్‌ సమయంలో అక్కడ హోటల్‌ గదిలో తనపై జానీ మాస్టర్‌ లైంగిక దాడికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే ఉద్యోగంలోంచి తీసేస్తానని, సినిమాల్లో ఎక్కడా పని దొరకకుండా చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. దాంతో తాను మిన్నకుండిపోవడాన్ని అవకాశంగా తీసుకుని, తరచూ షూటింగ్‌ ప్రదేశాల్లో వేధించేవాడని.. వ్యానిటీ వ్యాన్‌లో తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టేవాడని వివరించారు. ఒప్పుకోకుంటే తన జుట్టు పట్టుకుని దాడి చేసేవాడని.. ఓ సందర్భంలో అద్దంతో నా ముఖంపై కొట్టాడని వాపోయారు. మాట వినకపోతే.. షూటింగ్‌ లొకేషన్‌లో అందరి ముందు అవమానపరిచేవాడని, అసభ్యంగా తాకేవాడని తెలిపారు. మతం మారి, తనను పెళ్లి చేసుకోవాలని హింసించేవాడని చెప్పారు.


ఇంటికి వచ్చి వేధించేవాడు

జానీ మాస్టర్‌ వేధింపులు పెరగడంతో.. తాను సొంతంగా పనిచేయడం ప్రారంభించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు. దీంతో జానీ మాస్టర్‌ ఓ రోజు తన భార్యతో కలిసి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. వారిద్దరూ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారని, జానీ మాస్టర్‌ భార్య తనపై చేయి చేసుకున్నారని వివరించారు. ఓ సారి రాత్రి ఇంటికి వచ్చి, తలుపు తట్టాడని, తాను స్పందించకపోవడంతో.. బయట పార్క్‌ చేసి ఉన్న తన స్కూటీని ధ్వంసం చేశాడని తెలిపారు. తాను షూటింగ్‌లో ఉన్న ప్రాంతానికి వచ్చి, గొడవపడేవాడని, పెళ్లి చేసుకుంటానని, మతం మారాలని అందరి ముందు వేధించేవాడని వెల్లడించారు. ‘‘ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నాపై దాడికి యత్నించారు. గుర్తుతెలియని పార్సిల్‌ పంపి భయభ్రాంతులకు గురిచేశారు. ఇండస్ట్రీలో నేను ఒప్పుకొన్న పనులను కూడా చేయకుండా జానీ మాస్టర్‌ వేధింపులకు గురిచేస్తున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోగలరు’’ అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

జనసేన సీరియస్‌ యాక్షన్‌

జానీ మాస్టర్‌ పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని. ఇటీవలి అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే, జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదవ్వడంతో.. జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ వేములపాటి అజయ్‌కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘‘జానీ మాస్టర్‌పై నమోదు అయిన కేసును జనసేన పార్టీ సీరియ్‌సగా తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్‌ జానీ భాషను ఆదేశించాం. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది’’ అని సోమవారం విడుదల చేసిన ఓ ప్రెస్‌నోట్‌లో స్పష్టం చేశారు.

ఫిల్మ్‌ చాంబర్‌ సీరియస్‌

జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ కార్యదర్శి కె.ఎల్‌.దామోదర ప్రసాద్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘జానీ మాస్టర్‌పై ఫిర్యాదు మా పరిశీలనలోకి వచ్చింది. ఆయనపై పోష్‌ 2013 చట్టం ప్రకారం విచారణ కొనసాగుతుంది. ఈ విషయంలో బాధితురాలి గోప్యతను కాపాడాలని మీడియాను అభ్యర్థిస్తున్నాము’’ అని ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు.


ఇప్పటికీ మార్పు లేదు: తాప్సీ పన్ను

మహిళలకు సమాజంలో ఎదురవుతున్న సమస్యలపై తీసిన బాలీవుడ్‌ చిత్రం ‘పింక్‌’. ఈ సినిమా విడుదలై సోమవారానికి ఎనిమిదేళ్లు. ఇదే రోజున జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు కావడం గమనార్హం..! ఈ చిత్రంలో నటించిన తాప్సీ పన్ను సోషల్‌ మీడియాలో సినిమా సంగతులను గుర్తుచేసుకున్నారు. ‘‘ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంతటి గుర్తింపు తెచ్చుకుంటుందని మా చిత్ర బృందం ఊహించలేదు. అయితే, ఈ సినిమా విడుదలై ఎనిమిది సంవత్సరాలు గడిచినా సమాజంలో ఎటువంటి మార్పూ లేదు. ఇప్పటికీ మహిళలకు తగిన భద్రత లేదు. ఈ చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఫీలయ్యే వాళ్లకు అదో బాధ’’ అని పేర్కొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 03:29 AM