Share News

MLC Jeevan Reddy: మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి..

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:32 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వీడడం ఖాయమన్న వార్తలకు పుల్‌స్టాప్‌ పడింది. తనకు సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకున్నారని తీవ్ర మనస్తాపం చెందిన జీవన్‌రెడ్డి ఎట్టకేలకు మెట్టు దిగారు.

MLC Jeevan Reddy: మెట్టు దిగిన ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి..

  • ఢిల్లీలో వేణుగోపాల్‌, దీపాదాస్‌తో భేటీ

  • ఫలించిన అధిష్ఠానం బుజ్జగింపులు

  • కాంగ్రెస్‌తోనే జాతి ఐక్యతన్న ఎమ్మెల్సీ

  • పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి

  • ప్రాధాన్యం: దీపాదాస్‌ మున్షీ

న్యూఢిల్లీ, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వీడడం ఖాయమన్న వార్తలకు పుల్‌స్టాప్‌ పడింది. తనకు సమాచారం ఇవ్వకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రె్‌సలో చేర్చుకున్నారని తీవ్ర మనస్తాపం చెందిన జీవన్‌రెడ్డి ఎట్టకేలకు మెట్టు దిగారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవాళ్ల అభిప్రాయాల ఆధారంగానే చేరికలు, ఇతర విషయాలలో ముందుకెళతామని అధిష్ఠానం హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. రంగంలోకి దిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పరిస్థితిని చక్కబెట్టారు. మూడ్రోజులుగా అసంతృప్తితో రగిలిపోతూ పార్టీని వీడేందుకు సిద్ధపడిన జీవన్‌రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌ చేసి ఢిల్లీ రావాలని కోరడంతో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి బుధవారం సాయంత్రం జీవన్‌ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో జీవన్‌రెడ్డితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అరగంటపాటు చర్చలు జరిపారు. అయినా జీవన్‌రెడ్డి వెనక్కి తగ్గలేదు.


ఆ తర్వాత ముగ్గురూ కలిసి కేసీ వేణు గోపాల్‌ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లినా తాను పార్టీని నమ్ముకుని ఉన్నానని ఈ సందర్భంగా జీవన్‌ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. కాంగ్రె్‌సలో ఎమ్మెల్యే సంజయ్‌ చేరికపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. జీవన్‌రెడ్డిని బుజ్జగించిన పెద్దలు.. పార్టీ అండగా ఉంటుందని, దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుుంజుకుంటున్న సమయంలో పార్టీని వీడవద్దని కోరినట్లు తెలిసింది. దీంతో చల్లబడిన జీవన్‌రెడ్డి సమ్మతించారు. భేటీ అనంతరం బయటికి వచ్చాక జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనకు కాంగ్రెస్సే ముఖ్యమంటూ వెల్లడించారు. కార్యకర్తలను కాపాడుకోవడం ఏ పార్టీకైనా ముఖ్యమని అన్నారు.


కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు మెరుగైన ఫలితాలు వచ్చాయని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, జాతి ఐక్యతను కాంగ్రెస్‌ కాపాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్‌ నెరవేరుస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలుకాని పథకాలను తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఏకకాలంలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీకి కాంగ్రెస్‌ సంకల్పించదని ఆయన హర్షం వ్యక్తం చేశారు.


ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ మాట్లాడటమా?: దుద్దిళ్ల

పార్టీలో సీనియర్‌ నేత అయిన జీవన్‌రెడ్డిని కించపరచడం తమ ఉద్దేశ్యం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరికను అగౌరవంగా, అమర్యాదగా భావించి ఉండవచ్చన్నారు. పార్టీలో చేరికలకు తలుపులు తెరిచే ఉన్నాయన్నారు. కాంగ్రె్‌సలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం తగ్గకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా కేసీ వేణుగోపాల్‌తో చర్చించే తీసుకుంటామని చెప్పారు. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. టీపీసీసీ అధ్యక్ష పదవిపై నిర్ణయం అధిష్ఠానానిదేనని ఆమె పేర్కొన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఫిరాయింపులపై ప్రశ్నించేందుకు ఆ పార్టీకి కాస్త అయినా నైతికత ఉండాలని మండిపడ్డారు. అధికారంలో ఉండగా కాంగ్రె్‌సను అంతం చేయాలని ప్రయత్నించారన్నారు. ఇపుడు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మార్పు ఎలా ఉందో స్పష్టంగా కనపడుతోందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 04:32 AM