Share News

BC Reservation: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం?

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:59 AM

పంచాయతీరాజ్‌ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి తలెత్తకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని అడిగారు.

BC Reservation: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లోగా పెట్టగలం?

  • బీసీ కుల గణనకు ఎంత సమయం పడుతుంది?

  • కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి

  • కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు

  • పంచాయతీరాజ్‌ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

  • జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచన

  • 56 అంశాలతో చేపడితే ఐదున్నర నెలలు

  • కులగణనపై సీఎంకు అధికారుల వివరణ

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి తలెత్తకూడదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని అడిగారు. కులగణన పూర్తయ్యాక బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించగలుగుతామో ఒక అంచనాకు రావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సోమవారం ఆయన పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజ నరసింహ, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ ముఖ్యనేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.


బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్థం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే కుల గణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని సీఎం అధికారులను ప్రశ్నించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న ఎన్నికలకు సన్నద్థమవుతున్న తీరును అధికారులు వివరించారు. కర్ణాటకలో 2015లో, బిహార్‌లో 2023లో కులగణన చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేసినప్పటికీ ఇంకా వివరాలు బయట పెట్టలేదని తెలిపారు.


2011లో కేంద్ర ప్రభుత్వం కుల గణనకు ఉపయోగించి ఫార్మట్‌లో 53 కాలాలు ఉన్నాయని, వాటికి మరో మూడు కాలాలు జోడించి కుల గణన చేపడితే ఐదున్నర నెలల్లో పూర్తి చేయవచ్చని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల విషయంలో అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసానాలను కాంగ్రెస్‌ ముఖ్యనేత, మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ, స్థానిక సంస్థల్లో ఇప్పటిదాకా అమలు చేసిన రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లకు సంబంధించి, గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


ఏవైనా సందేహాలు వస్తే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్‌ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన విషయాల్లో అడ్వొకేట్‌ జనరల్‌తో చర్చించాలని సూచించారు. మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విషయాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. త్వరగా ఆయా అంశాలపై నివేదిక రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మరోసారి సమావేశమై ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుందామని సీఎం వెల్లడించారు.

Updated Date - Jul 16 , 2024 | 03:59 AM