Andhra Pradesh Growth: వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:32 AM
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 8.21 Per జీఎస్డీపీ వృద్ధిరేటుతో దేశంలో రెండో స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయ వృద్ధిలో మూడోస్థానాన్ని సాధించినట్లు కేంద్రం తెలిపింది

ఏపీ@ 8.21%
ఏపీ రైజింగ్
తలసరి ఆదాయంలో మూడో స్థానం
కేంద్ర గణాంకాల శాఖ నివేదిక
రాష్ట్రం గాడిన పడింది
ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ ‘ఎక్స్’లో చంద్రబాబు హర్షం
జగన్ హయాంలో వృద్ధి రేటు 6.19 శాతమే
అమరావతి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): గత ఆర్థిక సంవత్సరం(2024-25)లో జీఎస్డీపీ వృద్ధిరేటులోనూ, తలసరి ఆదాయం పెరుగుదలలోనూ రాష్ట్రం విశేషంగా రాణించిందని కేంద్రం వెల్లడించింది. 8.21 శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం రెండో స్థానంలో, తలసరి ఆదాయం వృద్ధిలో మూడోస్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు-కార్యక్రమాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం గాడిలో పడిందని, ఆత్మవిశ్వాసం పెంచేలా ఫలితాలు వస్తున్నాయని ఆదివారం ‘ఎక్స్’లో తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్’ అని వ్యాఖ్యానించారు. కేంద్రం నివేదిక ప్రకారం.. వైసీపీ హయాంలో 2023-24లో వృద్ధిరేటు కేవలం 6.19 శాతమే ఉండగా.. 2024-25లో 8.21 శాతం సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఒక్క ఏడాదిలోనే 2.02 శాతం పెరిగింది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకొచ్చిన విధానాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల సమష్టి విజయమంటూ అందరికీ అభినందనలు తెలిపారు. బంగారు భవిష్యత్ కోసం కలిసి ప్రయాణాన్ని కొనసాగిద్దామని పిలుపిచ్చారు. 2024-25లో రాష్ట్రం 8.21 శాతం వృద్ధిరేటుతో రూ.8.65 లక్షల కోట్ల జీఎస్డీపీని సాధించిందని కేంద్రం తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ధరల ప్రకారం 12.02 శాతం వృద్ధిరేటుతో రూ.15.93 లక్షల కోట్ల జీఎస్డీపీ నమోదైంది. ఈ విభాగంలో 5వ స్థానంలో నిలిచింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 15.41 శాతం వృద్ధిరేటు నమోదైంది.
వ్యవసాయ రంగంలో 22.98 శాతం, ఉద్యాన రంగంలో 21.29 శాతం నమోదైంది. పారిశ్రామిక రంగం ఇంకా స్తబ్ధుగానేఉంది. 6.4 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. నిర్మాణ రంగంలో 10.28 శాతం, ఉత్పాదకం-5.18 శాతం, సేవలు 11.82 శాతం, విద్య, ఆరోగ్యం-12.15 శాతం, వాణిజ్యం, హోటళ్లు, ఇతర రంగాల్లో 11.58 శాతం వృద్ధి నమోదైంది. రియల్ ఎస్టేట్స్, ఇతర రంగాలు 11.22 శాతం నమోదు చేశాయి. 2024-25లో తలసరి ఆదాయంలో 11.89 శాతం వృద్ధి నమోదైంది. తలసరి రాబడి రూ.2,66,240కు చేరింది. ఇందులో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
బాబు హయాంలో గతంలోనూ డబుల్ డిజిట్
సీఎం చంద్రబాబు 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కృషిచేస్తున్నారు. గత ఏడాది జూన్లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, సమస్యల పరిష్కారం.. 2019-24 మధ్య తలెత్తిన సమస్యల నుంచి రాష్ట్రం కోలుకోవడానికి దోహదపడ్డాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. ఆయన హయాంలోనే ఏపీ రెండు సార్లు డబుల్ డిజిట్ వృద్ధి రేటును నమోదుచేసింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు 2015-16లో 12.16ు, 2017-18లో 10.09% వృద్ధి రేటు సాధించినట్లు నివేదిక తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్