పోలీసు అధికారులు కావలెను!
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:41 AM
జిల్లా పోలీసు వ్యవస్థను సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లా కేంద్రమైన తిరుపతి నగర డీఎస్పీ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేస్తుండిన వెంకటనారాయణను బదిలీ చేసిన ప్రభుత్వం రెగ్యులర్ డీఎస్పీని నియమించలేదు.

తిరుపతి డీఎస్పీ, ఈస్ట్, వెస్ట్ సీఐలుగా ఇన్చార్జులు
స్పెషల్ బ్రాంచికి డీఎస్పీ లేరు
తిరుపతి(నేరవిభాగం), మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు వ్యవస్థను సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లా కేంద్రమైన తిరుపతి నగర డీఎస్పీ పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేస్తుండిన వెంకటనారాయణను బదిలీ చేసిన ప్రభుత్వం రెగ్యులర్ డీఎస్పీని నియమించలేదు. తాత్కాలికంగా మహిళా స్టేషన్ డీఎస్పీ శ్రీలతను ఇన్చార్జిగా నియమించారు. వీఐపీల తాకిడి, రాత్రి గస్తీలు, శాంతి భద్రతల పరిరక్షణ వంటివి కష్టతరమవుతున్నాయి. డివిజన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో ఈస్ట్, వెస్ట్లకు రెగ్యులర్ సీఐలు లేరు. వెస్ట్ సీఐగా పనిచేస్తుండిన రామకృష్ణను గతంలో ఎస్పీ సుబ్బరాయుడు ఇన్చార్జి సీఐగా అటాచ్మెంటు కింద నియమించారు. మొన్నటివరకు వీఆర్లో ఉన్న మురళీమోహన్రావును తాత్కాలికంగా వెస్ట్ సీఐగా అటాచ్మెంట్ ఇచ్చారు. మరోవైపు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన గిరిధర్ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లారు. ఆయన మళ్లీ జాయిన్ అవుతారనే విషయం అనుమానంగానే ఉందన్న చర్చ నడుస్తోంది. జిల్లా మొత్తం స్పెషల్ బ్రాంచ్ వ్యవహారాలు సీఐ ఒక్కరే చూస్తున్నారు. అతను కూడా కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో జిల్లాపై పూర్తి స్థాయి అవగాహన లేదు. తిరుపతి ప్రాముఖ్యత దృష్ట్యా పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.