నేటినుంచి టెన్త్ పరీక్షలు
ABN , Publish Date - Mar 17 , 2025 | 02:01 AM
జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు
21,248 మంది విద్యార్థులకు 118 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
చిత్తూరు సెంట్రల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163వ సెక్షన్ అమలులో ఉంటుందని ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి తెలిపారు. కేంద్రాల వద్ద జెరాక్స్ కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 21,248 మంది పరీక్షకు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 11,005 మంది, బాలికలు 10,243 మంది ఉన్నారు. వీరికోసం 118 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో 118 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 118 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 1197 మంది ఇన్విజిలేటర్లు, 37 మంది స్టోరేజ్ కస్టోడియన్లు పాల్గొంటారు. అలాగే 40 సిట్టింగ్ స్క్వాడ్లు, 8 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం హెల్ప్లైన్ నెంబరు (90321 85001) అందుబాటులో ఉంచారు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలను 1165 మంది రాయనున్నారు. వీరికోసం 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.