Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్
ABN, Publish Date - Apr 01 , 2025 | 04:36 PM
Minister Nadendla Manohar: కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. మే నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అమరావతి: ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. ఇవాళ(మంగళవారం) మంత్రి నాదెండ్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
24 గంటల్లోపు నగదు జమ..
ఇవాల్టి నుంచి దీపం 2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయని అన్నారు. ఖరీఫ్ సీజన్లో 35 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రైతుకు ఒక భరోసా ఇస్తూ వారికి 24 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ చేశామని అన్నారు. రూ.8 వేల 279 కోట్లు ధాన్యం కొనుగోలు చెల్లింపులు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
రేషన్ బియ్యం స్మగ్లింగ్..
5 గోదాముల్లో మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించే బియ్యం నిల్వ చేసి ప్యాకింగ్ చేయిస్తున్నామని తెలిపారు. రబీలోనూ ఖరీఫ్ బియ్యం కొనుగోలు కొనసాగుతుందని చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగానే వ్యవహరిస్తున్నామని అన్నారు. పీడీ యాక్టులోనూ రేషన్ బియ్యం స్మగ్లింగ్ను చేర్చామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం రూ.1600 కోట్లతో ఎండీయూలు కొనుగోలు చేసి దుర్వినియోగం చేసిందని ఆరోపణలు చేశారు. ఎండీయూల కొనుగోలు ఓ పెద్ద కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు.దీనిపై విచారణ జరుగుతోందని.. త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
జగన్ ప్రభుత్వంలో అవినీతి..
గత జగన్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో కూడా అవినీతి జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతులు ధాన్యాలను అమ్ముకునేందుకు మిల్లుల వద్ద పడిగావులు కాయాల్సి వచ్చే పరిస్థితి ఉందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లల్లో వాట్సాప్ , జీపీఎస్లను సాంకేతికంగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. రైతులే వారికి నచ్చిన మిల్లుల వద్ద ధాన్యం అమ్ముకునేలా అవకాశం కల్పించామని చెప్పారు. ఈ సీజన్లో చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని మాటిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వలో మాదిరిగా ధాన్యం కొనుగోలు చేయలేదని అన్నారు. రబీ సీజన్లో రైతులకు ఒక భరోసా కల్పిస్తూ ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రైతు సహాయక కేంద్రాల ఏర్పాటు...
రబీలో 13 లక్షలు 50 వేల మెట్రిక్ టన్నులు పంట వస్తుందని అంచనా వేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లై నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 2900 రైతు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 12 వేల మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపం 2 పథకం అమలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
రెండో సిలిండర్ బుక్ చేసుకోండి..
ఈ నెల ఒకటో తేదీ నుంచి దీపం 2 పథకం కింద రెండో సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు దీపం 2 పథకం అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధార్తో ఈ కెవైసీ లింక్ చేసుకోవాలని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో వాహనాల కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 44 వేల 394 ప్రభుత్వ పాఠశాలలకు సూపర్ ఫైన్ బియ్యాన్ని మధ్యాహ్న భోజనానికి సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 01 , 2025 | 08:14 PM