ప్రభుత్వ పాలనలో రెవెన్యూశాఖ కీలకం
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:15 AM
ప్రభుత్వ పాలనలో రెవెన్యూశాఖ ఎంతో కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.

శ్రీకాకుళం అర్బన్/అరసవల్లి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలనలో రెవెన్యూశాఖ ఎంతో కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. నగరంలో అంబేడ్కర్ జంక్షన్లో గల రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆధునికీకరణ చేసిన రెవెన్యూ అతిథి గృహాన్ని శనివారం రెవెన్యూ అసోయేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కలెక్టర్ వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరం రెండు రోజులు కొనసాగుతుందని, రెవెన్యూశాఖ కుటుంబ సభ్యులు సద్వినియో గించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, తహసీల్దార్ ఎం.గణపతిరావు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె.శ్రీరాములు, బీవీ ఎస్ఎన్ రాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ ప్రతిష్టాత్మ కమైన రెవెన్యూశాఖలో ‘నిధులు నిల్.. పనులు మాత్రం పుల్’ అన్నట్టుగా పరిస్ధితి తయారైనందన్నారు. ప్రస్తుతం ప్రతీ పనిని ఆన్లైన్ విధానంలో చూపడుతున్న తరుణంలో రెవెన్యూశాఖలో కిందిస్థాయి సిబ్బందికి సాంకేతిక శిక్షణ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీఆర్ఏలు ఎన్నో ఏళ్లుగా రూ.10వేలకే వెట్టిచాకిరీ చేస్తున్నారన్నారు.