MLA Nakka Anand Babu: జగన్ పత్రికవి తప్పుడు రాతలు
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:13 AM
జగన్ పత్రికలో తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు సహా పలువురు నేతలు హరీష్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు

స్వార్థంతో రాష్ట్రానికో తీరున కథనాలు
చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి టీడీపీ ఫిర్యాదు
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): జగన్ పత్రిక తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు, మాజీ ఎమ్మెల్సీ అశోక్బాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్, చిట్టిబాబు బుధవారం డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆయన కార్యాలయంలో కలిశారు. జగన్ మీడియా ఎడిటర్లు, డైరెక్టర్లపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయ లబ్ధి కోసం జగన్ తన పత్రికను అడ్డం పెట్టుకుని రాష్ట్రానికో తీరున అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు కథనాలతో సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా రాతలు రాస్తున్న జగన్ మీడియాపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరాం’ అని టీడీపీ నేతలు తెలిపారు.