Share News

NRI: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు

ABN , Publish Date - Feb 25 , 2025 | 07:26 AM

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” కార్యక్రమంలో భాగంగా ఈనెల ఆఖరి ఆదివారం 77వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “నా భాషే నా శ్వాస” అంశంపై నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాతృభాష మాదుర్యాన్ని తెలియజేశారు.

NRI: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు
TANA

ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీన 77వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “నా భాషే నా శ్వాస” (పసిప్రాయంనుండే పిల్లలకు దేశ, విదేశాలలో తల్లిభాష ఎలా నేర్పుతున్నారు?) అంశంపై నిర్వహించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలికి, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సభను ప్రారంభించారు.


సభకు అధ్యక్షతవహించిన తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ అప్పటి తూర్పు పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్) లో ‘బెంగాలీభాష’ అధికార గుర్తింపు కోసం 1952లో ఫిబ్రవరి 21న పాకిస్తాన్ ప్రభుత్వ తూటాలకు బలిఅయిన వారి స్మారకంగా ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించిందని గుర్తుచేశారు. మాతృభాషలో సరైన పునాదిఏర్పడిన తర్వాతే ఆంగ్లం లేదా ఇతర భాషలను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి వీలవుతుందనే వాస్తవాన్ని ఏ ఒక్కరూ విస్మరించకూడదని, ఆంగ్లభాష మోజులోపడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం తగదని, ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం భాగస్వాములు కావాలని సూచించారు.


నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెన్నం ఉమ మాట్లాడుతూ పిల్లలు పసివయస్సులో తన తల్లి, కుటుంబసభ్యుల వాతావరణంలో మాతృభాషను వినికిడి ద్వారా, అనుకరణ ద్వారా, గమనించడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారని ఆ పరిస్థితులను కల్పించవలసిన బాధ్యత పెద్దలమీదే ఎక్కువగా ఉంటుందన్నారు. చాలా అర్ధవంతమైన, అవసరమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులకు, పాల్గొన్న విశిష్టఅతిథులకు ఆమె అభినందనలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో విశిష్టఅతిథులుగా పరవస్తు ఫణి శయన సూరి, మణికొండ వేదకుమార్, ఏనుగు అంకమ నాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయిని పురస్కారగ్రహీత డాక్టర్ మురహరరావు ఉమాగాంధీ, జ్యోతిర్మయి కొత్త, ఫణి డొక్కా, వెంకట రామారావు పాలూరి, రవిశంకర్ విన్నకోట, భానుప్రకాష్ మాగులూరి, ఇందిర చెరువు పాల్గొని పిల్లలకు తెలుగుభాషను నేర్పడంలో వారు అనుసరిస్తున్న వినూత్న విధానాలను, సాధిస్తున్న ఫలితాలను సోదాహరణం గా వివరించారు. తల్లిభాషను భావితరాలకు అందించడంలో తల్లిదండ్రుల శ్రద్ధ, ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంతో అవసరం అన్నారు. తానా సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‌

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 25 , 2025 | 08:21 AM