Mahabubabad: పొలమారి ఊపిరితిత్తుల్లోకి పల్లీ గింజ
ABN , Publish Date - Mar 10 , 2025 | 04:24 AM
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్పల్లిలో ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి పల్లీ గింజలు తింటుండగా పొలమారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మృతి చెందాడు.

ఊపిరాడక ఏడాదిన్నర బాలుడి మృతి
గూడూరు (మహబూబాబాద్ జిల్లా), మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్పల్లిలో ఏడాదిన్నర వయసున్న ఓ చిన్నారి పల్లీ గింజలు తింటుండగా పొలమారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మృతి చెందాడు. దాంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నాయక్పల్లి గ్రామానికి చెందిన గుండెల వీరన్న, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఏడాదిన్నర వయసున్న కుమారుడు అక్షయ్శివ ప్రేమ్కుమార్ ఉన్నారు.
అక్షయ్ శివ ఈ నెల 7న శుక్రవారం ఇంటి వద్ద పల్లీగింజలు తింటుండగా పొలమారి గింజ ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో కుటుంబసభ్యులు బాలుడిని శనివారం వరంగల్ ఏంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.