మహిళా సంక్షేమానికి పెద్దపీట: మహేశ్గౌడ్
ABN , Publish Date - Mar 02 , 2025 | 03:45 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తమ సర్కారు ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.

మహిళాసంఘాల ద్వారా 600బస్సులు కొంటాం: పొన్నం
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తమ సర్కారు ఏర్పడిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. శనివారం గాంధీభవన్లో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవల్పమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పరిధిలో ఉచిత కుట్టు మెషిన్ శిక్షణ పొందిన 2వేల మంది మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఉచిత కుట్టు మెషిన్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
వనపర్తిలో 40 వేల మందికి ప్రయోజనం చేకూర్చనున్నట్టు చెప్పారు. మహిళా సంఘాల ద్వారా 4,000మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. మహిళల పేరు మీద సుమారు 40లక్షల కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పొన్నం తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు.