Myanmar And Thailand: బ్యాంకాక్లో భూకంపం.. తృటిలో తప్పించుకున్న తెలుగు ఎమ్మెల్యే కుటుంబం
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:16 PM
మయన్మార్లో భూకంపాల కారణంగా బ్యాంకాక్లో భారీగా భూప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో తెలుగు ఎమ్యెల్యే తన ఫ్యామిలీతో టూరులో ఉన్నారు. అదృష్టం బాగుండి ఆయన కుటుంబం భూకంపం బారి నుంచి తప్పించుకున్నారు.

మయన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ భూకంపాల ప్రభావం కారణంగా బ్యాంకాక్లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. ఛాతుచక్ జిల్లాలోని ఓ ఎత్తైన భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు బలయ్యారు. మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకు పోయారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకాక్ టూరులో ఉన్న ఓ తెలుగు ఎమ్మెల్యే కుటుంబం తృటిలో తప్పించుకుంది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం బ్యాంకాక్ టూరులో ఉన్నారు. మక్కన్ సింగ్ ఫ్యామిలీ తిరుగుతున్న ప్రదేశంలోనూ భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారు. అంతేకాదు.. భూప్రకంపలు వచ్చిన ప్రదేశాల్లో ఇండియాకు చెందిన వాళ్లు పెద్ద మొత్తంలో ఉన్నట్లు సమాచారం.
కాగా, శుక్రవారం మధ్యాహ్నం సమయంలో మయన్మార్లో వరుసగా రెండు భూకంపాలు వచ్చాయి. రెక్టార్ స్కేల్పై ఆ భూకంపాల తీవ్రత 7.7, 6.4గా నమోదైంది. మయన్మార్లో వచ్చిన భారీ భూకంపాల ప్రభావం బ్యాంకాక్తో పాటు భారత్, బంగ్లాదేశ్, చైనాలపై కూడా పడింది. మూడు దేశాల్లోనే పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. ఇక, మయన్మార్, థాయ్లాండ్ భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శుక్రవారం తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. రెండు దేశాలకు భారత్ తరుపున వీలైనంత సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం భూకంపాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జనం రోడ్ల మీద భయంతో అరుస్తూ పరుగులు పెడుతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Kunal Kamra: కునాల్ కామ్రాకు తాత్కాలిక బెయిల్
Earthquake Alerts: భూకంపాన్ని ముందే తెలుసుకోండి..మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ చేసుకుంటే చాలు..