HCU: హెచ్సీయూలో ఉద్రిక్తత
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:40 AM
యూనివర్సిటీ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) విద్యార్థులు శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

క్యాంప్సలో భారీగా పోలీసుల మోహరింపు
హైదరాబాద్ సిటీ/ రాయదుర్గం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) విద్యార్థులు శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయకుండా విద్యార్థిసంఘం నేతలను, విద్యార్థులను నెట్టివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ తోపులాటలో కొందరు విద్యార్థులు స్పృహ కోల్పోగా, మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసుల ప్రయత్నాలను తిప్పికొడుతూ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఖజానా లోటును పూడ్చుకోవడానికి, ప్రైవేట్ వ్యక్తులకు హెచ్సీయూ భూములు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులను గుంటనక్కలు అని రేవంత్ అనడం సరికాదని, ఆయన తన భాష మార్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి లోకానికి సీఎం తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హెచ్సీయూ భూములను వేలం వేయాలన్న నిర్ణయాన్ని రేవంత్ సర్కార్ ఉపసంహరించుకునే వరకూ పోరాటం సాగుతుందని విద్యార్ధి నేతలు పేర్కొన్నారు.