Telangana Secretariat: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్చల్
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:41 PM
Telangana Secretariat: రాష్ట్ర సచివాలయంలో నకిలీ ఉద్యోగులను ఇంటలిజెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. నకిలీ ఉద్యోగుల కదలికలపై సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఎంతో చాకచక్యంగా ఓ నకిలీ ఉద్యోగిని ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్,హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పట్టుకున్నారు.

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) నకిలీ ఉద్యోగుల వ్యవహారం కలకలం రేపింది. ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన సదరు వ్యక్తులు.. ఉద్యోగుల పేరిట దర్జాగా తిరుగుతూ సెక్షన్ ఆఫీసుల్లో హల్చల్ చేశారు. సెక్షన్ ఆఫీసుల్లో పనులు చేపిస్తామంటూ దందాలకు దిగారు. నకిలీ ఉద్యోగుల సమాచారంతో సచివాలయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నకిలీ ఉద్యోగుల కదలికలపై సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఎంతో చాకచక్యంగా ఓ నకిలీ ఉద్యోగిని ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్,హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పట్టుకున్నారు.
ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు... రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్నట్లు గుర్తించారు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి. ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావు ఫేక్ ఐడి కార్డు తయారు చేసినట్లు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ క్రమంలో డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్గా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్న భాస్కర్ రావు, డ్రైవర్ రవిని ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
రాష్ట్ర పరిపాలన వ్యవహారాలన్నీ సచివాలయం నుంచే నడుస్తుంటాయి. సీఎం, మంత్రులు, విభాగాధిపతులు అంతా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఎంట్రీపై కొంత నియంత్రణ ఉంటుంది. ఉద్యోగులతో పాటు మంత్రులను కలవాలనుకునే విసిటర్స్.. ఓ పద్దతి ప్రకారం పాసులు తీసుకుని లోపలికి వెళ్లా్ల్సి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో అన్ని ఫ్లోర్లలో విజిటర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో పాసులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తూ నిఘాను పెంచారు సచివాలయ భద్రతా సిబ్బంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పేరుతో నకిలీ ఐడెంటిటీ కార్డులతో కొందరు వ్యక్తులు లోపలికి వెళ్తున్న విషయం బయటకు వచ్చింది. కొంతమంది ఫేక్ ఐడెంటికీ కార్డుతో లోపలికి ప్రవేశించి ఎంతో దర్జాగా సెక్షన్ ఆఫీసుల్లో తిరుగుతూ దందాలు చేస్తున్న పరిస్థితి.
ఈ విషయం సచివాలయ భద్రతా సిబ్బంది దృష్టికి వచ్చింది. దీంతో ఇంటెలిజన్స్ అధికారులు ఎంతో చాకచక్యంగా నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ మీడియా సమావేశంలో ఉద్యోగి పేరిట హల్చల్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బట్టబయలైంది. నకిలీ ఐడెంటిటీ కార్డుతో చలామణి అవుతున్న విషయం బయటపడింది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ అనే వ్యక్తి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా నకిలీ ఐడెంటిటీకార్డు తీసుకుని సెక్షన్లో దర్జాగా తిరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించారు. ఇతనికి సహకరించిన రవి అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇవి కూడా చదవండి...
నేటి నుంచి ‘వాట్సాప్ పరిపాలన’
T High Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఇద్దరికి బెయిల్ మంజూరు
Read Latest Telangana News And Telugu News