Share News

CM Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

ABN , Publish Date - Jan 22 , 2025 | 11:12 AM

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌ చర్చలు జరిపారు. ఈ క్రమంలో వారి మధ్య ఎంవోయూ కుదిరింది. దీంతో వచ్చే నెలలో హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.

CM Revanth Reddy:  దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం

సింగపూర్: దావోస్‌ (Davos)లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు (World Economic Forum conference)లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) మరో కీలక ఒప్పందం (MOU) చేసుకుంది. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ (HCL) హైదరాబాద్‌లో టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో చర్చలు జరిపారు. హెచ్‌సీఎల్ కొత్త సెంటర్‌లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యమిస్తుంది. అత్యాధునిక క్లౌడ్, ఆర్ట్‌ఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్‌‌లను అందిస్తుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణయంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతుంది. ఇక తెలంగాణలో హెచ్‌సీఎల్ సేవల విస్తరణను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు. వచ్చే నెలలో కొత్త సెంటర్‌ను ప్రారంభించాలని ఆహ్వానించారు.

ఐ వార్త కూడా చదవండి..

దావోస్‌లో సీఎం చంద్రబాబు 3వ రోజు పర్యటన


కాగా దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌ చర్చలు జరిపారు. వచ్చే నెలలో హైదరాబాద్ హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌సీఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి హెచ్‌సీఎల్ గోల్డ్ సర్టిఫికేషన్‌ అందుకుంది.ఈ హెచ్‌సీఎల్ కొత్త సెంటర్ ఏర్పాటుతో దాదాపు 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు రానున్నాయి.


యూనీలీవర్‌తో బోణీ

కాగా దావోస్‌లో పెట్టుబడుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం బోణీ కొట్టింది. విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణలో రెండు తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని యూనీ లీవర్‌ కంపెనీ తెలిపింది. తెలంగాణలో పామాయిల్‌ ఫ్యాక్టరీ, రిఫైనింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని; సీసా మూతలు ఉత్పత్తి చేయడానికి కొత్త తయారీ యూనిట్‌ పెడతామని ప్రకటించింది. యూనీ లీవర్‌ ఉత్పత్తులు ఎక్కువగా ద్రవ రూపంలో సీసాల్లో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం బాటిల్‌ క్యాప్‌లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలోనే సీసా మూతలను ఉత్పత్తి చేస్తే దిగుమతి అవసరం ఉండదని కంపెనీ తెలిపింది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన యూనీ లీవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందించారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని, కామారెడ్డి జిల్లాలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని స్పష్టం చేశారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం మంగళవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. పెట్టుబడుల ఆకర్షణకు ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో యూనీ లీవర్‌ సీఈవో హీన్‌ షూ మేకర్‌, చీఫ్‌ సప్లయ్‌ చైన్‌ ఆఫీసర్‌ విల్లెం ఉయిజెన్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీగా యూనీలీవర్‌కు పేరుంది. మన దేశంలో హిందుస్థాన్‌ లీవర్‌ పేరిట వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను

సీఎం రేవంత్‌ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, నైపుణ్యమున్న మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహాలను తెలిపారు. దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాలకూ తెలంగాణ వారధిగా ఉంటుందని, అనుకూల వాతావరణంతోపాటు తూర్పు, పడమరన ఉన్న మిగతా రాష్ట్రాలకు ముఖ ద్వారంగా ఉంటుందని అన్నారు. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్‌ ఉందని, సులభతర వ్యాపార విధానాలు అదనపు బలమని చెప్పారు. తెలంగాణ రైజింగ్‌ 2050 విజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళిక ప్రపంచంలో అత్యుత్తమంగా అందరినీ ఆకర్షిస్తోందన్నారు. దాంతో, తెలంగాణలో వ్యాపారాల విస్తరణకు, కొత్త యూనిట్‌ ఏర్పాటుకు యూనీ లీవర్‌ ముందుకొచ్చింది. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, సీఎంవో ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, పెట్టుబడుల ప్రోత్సాహ విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్థన్‌ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.


స్కైరూట్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో ప్రైవేట్‌ రాకెట్‌ తయారీ, ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని ప్రైవేటు రంగంలో తొలి అంతరిక్ష ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన స్కైరూట్‌ కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ వ్యవస్థాపకుడు పవన్‌ కుమార్‌ చందన దావో్‌సలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం.. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ ప్రైవేట్‌ రాకెట్‌ తయారీ, ఇంటిగ్రేషన్‌ మరియు టెస్టింగ్‌ యూనిట్‌ను స్కైరూట్‌ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంపై సీఎం రేవంత్‌ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. స్కైరూట్‌తో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందన్నారు. త్వరలోనే హైదరాబాద్‌ను ప్రైవేట్‌ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్థి చేస్తామన్నారు. తె లంగాణలో పెట్టుబడులు పెట్టడం తమకు సంతోషంగా ఉందని స్కైరూట్‌ సహ వ్యవస్థాపకుడు పవన్‌ కుమార్‌ చందన అన్నారు. తెలంగాణ రైజింగ్‌, హైదరాబాద్‌ రైజింగ్‌ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటామన్నారు.

పారిశ్రామికవేత్తలతో చర్చలు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సదస్సులో వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. కృత్రిమ మేధ (ఏఐ)తో కూడిన ఉత్పత్తుల్లో ప్రపంచ ఖ్యాతిగాంచిన కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న సాంబానోవా కంపెనీ చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ సూలేతో చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణలో సెమీ కండక్టర్‌ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. కంపెనీతో చర్చలు సానుకూలంగా ముగిశాయని, త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి.

మెఘా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ ప్రభుత్వంతో మెఘా ఇంజనీరింగ్‌ కంపెనీ 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజ్‌ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేసింది. దావోస్‌ సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో మెఘా కంపెనీ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుపై దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నిర్మాణ దశలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మరో 250 మందికి అదనంగా ఉద్యోగాలు లభిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మెఘా కంపెనీ అధినేత ప్రకటించారు. అలాగే, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు మెఘా మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్‌ ప్రాజెక్టును స్థాపించనుంది. ఎంపిక చేసిన ప్రదేశాల్లో 100 ఎంవీహెచ్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఇందుకు రూ.3000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో, రెండేండ్లలో 1000 మందికి ప్రత్యక్షంగా, 3000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇక, పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు మెఘా ముం దుకొచ్చింది. అనంతగిరిలో ప్రపంచస్థాయి లగ్జరీ వెల్నెస్‌ రిసార్ట్‌ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. నిర్మాణ దశలోనే దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు

రెండోరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

సిఐడి మాజీ చీఫ్ అధికార దుర్వినియోగంపై విచారణ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 22 , 2025 | 11:13 AM