Share News

KTR: అక్కడ అంగుళం కూడా కొనకండి

ABN , Publish Date - Apr 04 , 2025 | 03:38 AM

కాంగ్రెస్‌ సర్కార్‌ చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారన్నారు. బాధ్యత గల సీఎంనన్న విషయం మరచి రేవంత్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

KTR: అక్కడ అంగుళం కూడా కొనకండి

  • మూడేళ్ల తర్వాత అధికారం మాదే.. ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటాం

  • 400 ఎకరాల్లో ఎకో పార్క్‌ను ఏర్పాటు చేస్తాం

  • రేవంత్‌.. రియల్‌ బ్రోకర్‌లా కాదు, మనిషిలా ఆలోచించు

  • సంజయ్‌..తంబాకు నమలడం కాదు.. పర్యావరణం గురించి తెలుసుకో

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘ఇప్పుడే చెబుతున్నా.. రేవంత్‌ వేసే బిస్కట్లకు ఆశపడకండి. ఆయన మాటలునమ్మి 400 ఎకరాల భూమిలో అంగుళం భూమికూడా కొనకండి. మూడేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటాం’ అని కేటీఆర్‌ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ భూముల్లో ఎకోపార్క్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారని వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ సర్కార్‌ చెప్పిందని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారన్నారు. బాధ్యత గల సీఎంనన్న విషయం మరచి రేవంత్‌ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందరికీ ఆ ప్రాంతంలో జింకలు, తాబేళ్లు, నెమళ్లు కనబడుతుంటే, కాంగ్రెస్‌ నేతలకు గుంటనక్కలు కనబడుతున్నాయని ఎద్దేవా చేశారు. బుల్డోజర్ల కింద నెమళ్లు, జింకలు చచ్చిపోతున్నాయంటూ విద్యార్థులు బయటపెట్టిన చిత్రాలు కృత్రిమ మేధతో చేసినవని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. అవన్నీ వాస్తవ చిత్రాలేనని, హెచ్‌సీయూ వెబ్‌సైట్‌లో ఈ చిత్రాలను ఎవరైనా చూడొచ్చని తెలిపారు. రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌లా కాకుండా 15 నిమిషాలు మనిషిలా ఆలోచించాలని రేవంత్‌కు సూచించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూవివాదంలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్‌ఎస్‌ పూర్తిమద్దతు ప్రకటించిందని, స్వయంగా హెచ్‌సీయూకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శల దృష్ట్యా ప్రత్యక్షంగా పాల్గొనడంలేదని ఆయన వెల్లడించారు. కోర్టులంటే రేవంత్‌ సర్కార్‌కు లెక్కలేదని.. హై డ్రా విషయంలో పలుసార్లు చివాట్లు పెట్టినా ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. 400 ఎకరాల భూమిలో చెట్లను నరకొద్దని సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది హెచ్‌సీయూ విద్యార్థులు, అఽధ్యాపకులు సాధించిన విజయమని ఆయన వెల్లడించారు.


సంజయ్‌.. తంబాకు నమలడం కాదు..!

బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రకృతి విధ్వంసమంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని కేటీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో హరితహారంద్వారా 270 కోట్ల మొక్కలునాటి దేశంలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చేలా తాము కృషిచేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తమ ప్రభుత్వంలో చేపట్టిన హరితవిప్లవానికి కితాబునిచ్చిందన్నారు. ‘‘తంబాకు నమలడం కాదు.. కేంద్ర ప్రభుత్వం హరిత విప్లవంలో ఇచ్చిన గ్రేడింగ్‌లు, బీఆర్‌ఎస్‌ పాలనలో పెరిగిన గ్రీనరీ ఏమిటో తెలుసుకోవాలి’’ అని బండి సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ పేర్కొన్నారు.


ఇక డైవర్షన్‌ పాలిటిక్స్‌

హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తప్పు పట్టడంతో సీఎం రేవంత్‌నుద్దేశించి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు ‘‘ హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని సుప్రీం కోర్టు విమర్శించింది. అంతేకాక ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చేసిన అర్థరహిత వ్యాఖ్యలను కూడా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో వీటినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి.. జోకర్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడతాడు. 3డీ మంత్రా పాటిస్తాడు. 3 డీ అంటే డిసెప్షన్‌, డిస్ట్రాక్షన్‌, డిస్ట్రక్షన్‌’’ అని కేటీఆర్‌ పోస్ట్‌ చేశారు.


రేవంత్‌ దుందుడుకు చర్యలకు చెంపపెట్టు

హెచ్‌సీయూ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ేస్ట ఇవ్వడం రేవంత్‌రెడ్డి దుందుడుకు చర్యలకు చెంపపెట్టు లాంటిదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీ్‌షరావు చెప్పారు. మొన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో, నేడు హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీం మొట్టికాయలు వేసిందని ఎక్స్‌వేదికగా ఆయన వెల్లడించారు. ప్రకృతి విధ్వంసాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోవడం శుభ పరిణామమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా హెచ్‌సీయూ భూముల విషయంలో వెనక్కు తగ్గాలని కవిత సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 03:38 AM