సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:15 AM
నల్లమల అభయారణ్యంలో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్యస్వామి దర్శనం కోసం రెండోరోజైన శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు.

అచ్చంపేట, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): నల్లమల అభయారణ్యంలో వెయ్యి అడుగుల లోయలో కొలువైన లింగమయ్యస్వామి దర్శనం కోసం రెండోరోజైన శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. చైత్ర పౌర్ణమి కావడంతో నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని దట్టమైన అభయారణ్యంలో వెలసిన లింగమయ్యను దర్శించుకునేందుకు అటవీశాఖ అధికారులు మూడు రోజులు అనుమతి ఇచ్చారు. దీంతో భక్తులు వ్యయప్రయాసాలకు ఓర్చుకుంటూ సాహసమే చే స్తున్నారు. వేలాదిగా వస్తున్న భక్తులతో అభయారణ్యం జనసంద్రంగా మారింది. లింగమయ్య కొలువైన లోయ కిటకిటలాడింది.
సలేశ్వరం వెళ్లేదారులు మొత్తం ట్రాఫిక్జామ్ కావడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. స్వామివారి దర్శనం కోసం 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీఎస్పీ శ్రీనివాసులు అధ్వర్యంలో 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థలు పండ్లు, అన్నప్రసాదాలు అందజేస్తున్నారు.