Share News

BRS: ‘నమస్తే’పై విజిలెన్స్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 04:02 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తమ సొంత మీడియా- నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక, తెలంగాణ టుడే ఆంగ్ల పత్రిక, టీన్యూస్‌ టీవీ చానల్‌కు నిబంధనలకు విరుద్ధంగా రూ.వందల కోట్లతో ప్రకటనలను ఇవ్వడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.

BRS: ‘నమస్తే’పై విజిలెన్స్‌

  • తెలంగాణ టుడే, టీన్యూస్‌పైనా.. గత సర్కారు హయాంలో సొంత మీడియాకే భారీగా ప్రకటనలు

  • రూ.348.43 కోట్ల యాడ్స్‌పై ప్రభుత్వం సీరియస్‌

  • ప్రకటనల లోగుట్టు విప్పనున్న విజిలెన్స్‌

  • అప్పట్లో సమాచార శాఖకు కేసీఆర్‌ ప్రాతినిధ్యం

  • ఈ కేసులో ఆయననూ విచారించే అవకాశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తమ సొంత మీడియా- నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక, తెలంగాణ టుడే ఆంగ్ల పత్రిక, టీన్యూస్‌ టీవీ చానల్‌కు నిబంధనలకు విరుద్ధంగా రూ.వందల కోట్లతో ప్రకటనలను ఇవ్వడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సొంత మీడియా సంస్థలకు రూ.348.43 కోట్లను వెచ్చించి ప్రకటనలను ఇచ్చిన వైనంపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ అంశంపై వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఇప్పటికే విజిలెన్స్‌ అధికారులు ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించినట్లు సమాచారం. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సైతం ఈ తతంగంపై పలుమార్లు బాహాటంగా విమర్శించారు. ‘‘పత్రికల సర్క్యులేషన్‌, టీవీ చానళ్ల రేటింగ్‌ ఆధారంగా టారి్‌ఫలను లెక్కిస్తారు. బీఆర్‌ఎస్‌ హయాంలో సొంత మీడియా కోట్‌ చేసిన రేటును సమాచార శాఖ అధికారులు ఓకే చేశారు’’ అని ఆయన విమర్శలు చేసిన విషయం తెలిసిందే..! సమాచార శాఖ విశ్రాంత అధికారులు కూడా కేసీఆర్‌ కుటుంబానికి చెందిన తెలంగాణ టుడే ఆంగ్ల దినపత్రిక విషయంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపారు. ‘‘నిబంధనల ప్రకారం.. ఓ పత్రిక 18 నెలలు నిరంతరాయంగా ప్రచురితమవ్వాలి.


ఆ తర్వాత ప్రభుత్వ ప్రకటనల జారీకి ఎంప్యానల్‌ అవ్వాలి. ఆ తర్వాతే సంబంధిత పత్రికకు ప్రకటనలివ్వాలి. కానీ, తెలంగాణ టుడే ఏర్పాటైన మూడు నెలలకే.. ఆ పత్రికకు ప్రకటనలివ్వాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి’’ అని వివరించారు. ఈ జీవో వెనక ఉన్నదెవరు? ఫైళ్లపై సంతకాలు చేసిందెవరు? ఈ విషయంలో సచివాలయ బిజినెస్‌ రూల్స్‌ను పాటించారా? లేక.. మౌఖిక ఆదేశాలతోనే కథ నడిపించారా? అనే కోణంపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో.. సోమవారం నుంచి విజిలెన్స్‌ బృందాలు పూర్తిస్థాయిలో ఈ వ్యవహరంపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పత్రిక/మీడియా సంస్థల నిర్వహణ ఖర్చులకే వాడారా? లేక ఇతర వ్యవహారాలకు మళ్లించారా? అనే అంశంపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. అప్పట్లో సమాచార శాఖకు కూడా కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో.. ఆయనను విజిలెన్స్‌ అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 06 , 2025 | 04:02 AM