‘మిర్యాల’లో పద్మవ్యూహంలా ట్రాఫిక్
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:47 AM
మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో ప్రధాన రహదారులలనే ట్రాఫిక్ అధికంగా ఉండగా.. ప్రస్తుతం అంతర్గత రహదారులలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

‘మిర్యాల’లో పద్మవ్యూహంలా ట్రాఫిక్
పట్టింపులేని ప్రజాప్రతినిధులు
అవస్థలు పడుతున్న ప్రజలు
మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతంలో ప్రధాన రహదారులలనే ట్రాఫిక్ అధికంగా ఉండగా.. ప్రస్తుతం అంతర్గత రహదారులలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
(మిర్యాలగూడ టౌన- ఆంధ్రజ్యోతి)
ఒకవైపు పట్టణ జనాభా పెరుగుతుండగా, మరో వైపు వాహనాల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. ప్రణాళిక లేక రహదారులన్నీ ఇరుకుగా ఉండటం, రోడ్లపైనే వాహనాలను పార్క్ చేయడంతో ట్రాఫిక్ పెరిగింది. ఉదయం, సాయంత్రపు వేళల్లో విద్యాలయాలు, కార్యాలయాలకు వెళ్లే వారి వాహనాలతో పట్టణ రహదారులన్నీ రద్దీతో కిటకిట లాడుతున్నాయి. రోడ్డును క్రాస్ చేయలేని ఏర్పడిందని పాదచారులు వాపోతున్నారు.
ఆ రూట్లలో మరీ ఇబ్బందిగా..
పట్టణంలోని డాక్టర్స్ కాలనీ, చర్చీ రోడ్డు, పాత వైష్ణవి హోటల్ రోడ్లలో వాహనాల రద్దీతో ప్రయాణం నరకంగా మారింది. సాక్షాత్తూ సబ్ కలెక్టర్ అధికారిక నివాసం రహదారిలో రోడ్డుకు ఇరువైపులా అరకిలోమీటరు మేర వాహనాలను పార్క్ చేస్తున్నా ఎవరూ పట్టించు కోవడం లేదు. ఆ రహదారంతా ఓ హోటల్లో విధులు నిర్వహించే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్లో ఉంటోంది. ఈ ప్రాంతంలో ఓ వాహనదారుడికైనా ఫోన వస్తే, ఆపి మాట్లాడుతున్నా ప్రైవేటు సెక్యూ రిటీ సిబ్బది తరిమేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 15 అడుగుల విస్తీర్ణం కూడా లేని డాక్టర్స్ కాలనీ రఽహదారుల్లోకి అంబులెన్స సరేసరి, ఆటోలు కూడా సక్రమంగా వెళ్లలేని దుస్థితి ఉంది. ఆ కాలనీకి వచ్చే వాహనాలన్నీ చర్చి రోడ్డులో ఇరువైపులా పార్క్ చేస్తున్నందున ఈ రహదారి ఇరుకుగా మారి వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఆక్రమణలతో అగచాట్లు
సాగర్ రోడ్డులోని గాంధీ విగ్రహం నుంచి రెడ్డీ కాలనీకి వెళ్లే రహదారి ఆక్రమణలతో నిండిపోతోంది. ఆ రూట్లో కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ స్టాళ్ల నిర్వాహకులు బల్లలు, టేబుల్స్ రోడ్లపై వేసి విక్రయాలు సాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నివాసాలనే దుకాణాలుగా మార్చి యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. మరోవైపు గాంధీ విగ్రహం ఎదుటే ఉన్న సిట్టింగ్ రూంకు వచ్చే మందు బాబులు నడి రోడ్డుపై వాహనాలను పార్క్ చేస్తున్నా సంబంధిత అధికారుల నుంచి స్పందనే లేదని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. గాంఽధీ విగ్రహానికి ఎడమవైపున ఉన్న రెండు ప్రధాన బ్యాంకులు ఈ రహదారినే పార్కింగ్కు వినియోగించుకుంటున్నాయి. ఆ రూట్లో మొదటి దుకాణంలో ఏర్పాటు చేసిన కర్రీ, ఫుడ్ పాయింట్ వద్ద మధ్యాహ్నం రెండుగంటల పాటు వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు.
రహదారులపైనే వాహనాలు నిలుపుతున్నారు
లింగానాయక్, మిర్యాలగూడ
రహదారులపైనే వాహనాలు నిలుపుతున్నారు. ఏ కాలనీలో చూసిని ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అలా బైక్లు, కార్లు నిలపడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. కాలనీలు, అంతర్గత రహదారులలో అయితే ఇబ్బంది ఉండదు.. ప్రధాన రోడ్లలో ఇలా వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలి.
పార్కింగ్కు స్థలం కేటాయించుకోవాలి
కె. అశోక్, మిర్యాలగూడ
వ్యాపార, వాణిజ్య సంస్థలు పార్కింగ్ కోసం స్థలం కేటాయించుకోవాలి. ఆయా కేంద్రాలకు వచ్చే వారు వాహనాలు నిలపడం తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడం సరికాదు. సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలి. వాహనాలు రహదారులపై నిలపకుండా చూడాలి. ఒకట్రెండు రోజులు ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే సర్దుకోవచ్చు. నిత్యం ఇలానే ఉంటే ఇబ్బందే కదా.