Venkaiah Naidu: రేవంత్ చేస్తోంది మంచి పనే
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:09 AM
‘హైడ్రా’ కూల్చివేతలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్నది మంచి పనేనని అన్నారు.

‘హైడ్రా’పై వెంకయ్య నాయుడి స్పందన
హైదరాబాద్ సిటీ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ‘హైడ్రా’ కూల్చివేతలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్నది మంచి పనేనని అన్నారు. తెలంగాణలో కనుమరుగవుతున్న చెరువులను పరిరక్షించేందుకు రేవంత్ చేపట్టిన చర్యలను ఆయన అభినందించారు. అయితే ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూడాలని, ఆక్రమణ కూల్చివేతల కారణంగా నష్టపోయిన పేదలను ఆదుకోవాలని సూచించారు. దేశం బాగుండడం అంటే మనుషులతో పాటు నదులు, చెరువులు, అడవులు, పశువులు పక్షులు.. తదితరాలన్నీ బాగుండాలన్నారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని లైఫ్ సైన్సెస్ విభాగంలో ‘ఉన్నత్ భారత్ అభియాన్’ పేరిట గురువారం నిర్వహించిన వర్క్షా్పలో వెంకయ్య నాయుడు మాట్లాడారు. గ్రామీణ మధ్యతరగతి కుటుంంబం నుంచి వచ్చిన తనను రాజ్యాంగ పదవుల్లో కూర్చోబెట్టిన సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలనే తలంపుతో పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలకు, సాంస్కృతిక సంస్థలకు వెళ్లి సహకారం అందిస్తున్నానని చెప్పారు. అలాగే హెచ్సీయూలో యుఆర్ అడ్వాన్డ్స్ థెర్యూటిక్స్ పరిశోధనశాలను ఆయన సందర్శించారు.