RAGI JAVA: రాగి జావకు చెల్లుచీటీ!

ABN , First Publish Date - 2023-04-21T02:15:53+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగా ముగిసింది.

RAGI JAVA: రాగి జావకు   చెల్లుచీటీ!

పంపిణీ నిలిపివేయాలని ఉత్తర్వులు

ఒంటిపూట బడుల సాకుతో నిలిపివేత

బదులుగా చిక్కీలు ఇవ్వాలని ఆదేశాలు

వేసవి సెలవుల తర్వాతే మళ్లీ పంపిణీ

ఇప్పటికే పాఠశాలలకు సరఫరా చేసిన

రాగి పిండి, బెల్లం పాడైపోయే ప్రమాదం

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమం మూణ్నాళ్ల ముచ్చటగా ముగిసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఉన్నప్పటికీ పంపిణీ నిలిపివేయాలంటూ మధ్యాహ్న భోజన విభాగం డైరెక్టర్‌ నిధి మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాగి జావకు బదులుగా చిక్కీలు పంపిణీ చేయాలని సూచించారు. పాఠశాలల పనివేళల్లో చేసిన మార్పుల కారణంగా దీనిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే సవరించిన పనివేళలతో పంపిణీకి వచ్చిన ఇబ్బందేమిటో ఆ ఉత్తర్వుల్లో వివరించలేదు. ఈ ఏడాది మార్చి 21న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. మంగళ, గురు, శనివారాల్లో పంపిణీ మొదలుపెట్టారు. ఇంతలోనే ఈ ఏడాదికి ఇక చాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మాత్రం దానికి ఇంత హడావిడిగా ఎందుకు ప్రారంభించడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అప్పటికే పథకం ప్రారంభాన్ని రెండుసార్లు వాయిదా వేశారు. ఇక ఈ ఏడాదికి ఉండకపోచ్చని అనుకున్న తరుణంలో గతనెల 21న ప్రారంభించారు. విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ముగుస్తుందన్నప్పుడు ఆగమేఘాలపై పథకాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని, కేవలం ప్రచారం కోసమే దీనిని ప్రారంభించారనే విమర్శలొచ్చాయి. పదో తరగతి పరీక్షలు రావడం, ఈ నెలలో ఎక్కువ సెలవులు ఉండటంతో జావ పంపిణీ కేవలం 12రోజులు మాత్రమే జరిగింది. మరోవైపు రోజుకు 10లక్షల మందికిపైగా విద్యార్థులు రాగిజావ తీసుకోవడం లేదు. దానిలో కలుపుతున్న బెల్లం సరిపోక చప్పగా ఉంటోందంటున్నారు. ఇప్పుడు అసలు పంపిణీయే వద్దంటూ ఉత్తర్వులు జారీచేశారు.

ఎందుకు ఇవ్వలేరు?

పథకం ప్రారంభించినప్పుడు ఉదయం విరామ సమయంలో రాగిజావ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ నెలలో ఒంటిపూట బడులు ప్రారంభించినప్పుడు కూడా ఇంటర్వెల్‌ సమయంలోనే ఇవ్వాలని ఆదేశించారు. అయితే చాలా పాఠశాలల్లో బడి వదిలే సమయంలో ఇస్తున్నారు. కాగా, ఒంటిపూట బడుల పనివేళలను ఎండ తీవ్రత నేపథ్యంలో 11.15 గంటలకు తగ్గించారు. ఈ నేపథ్యంలోనే రాగిజావ ఆపేసినట్లు చెబుతున్నారు. కానీ పంపిణీకి ఏవైనా అవాంతరాలు ఉన్నాయా అనేది వెల్లడించడం లేదు. వేసవి సెలవుల అనంతరం బడులు పునఃప్రారంభమైన తర్వాత రాగిజావ పంపిణీ తిరిగి ప్రారంభమవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జావ తయారీ కోసం ఇప్పటికే బడులకు సరఫరా చేసిన రాగి పిండి, బెల్లం ఏం చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటే అవి పాడైపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఏటా బడులు తెరిచే రోజు విద్యాకానుక పేరుతో ప్రభుత్వం కోట్లు వెచ్చించి ప్రకటనలు గుప్పిస్తోంది. ఏటా ఇచ్చేవే అయినా కొత్తగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. రాగిజావను కూడా వచ్చే విద్యా సంవత్సరంలోనే ప్రారంభిస్తే విద్యాకానుక ప్రకటనలో కలిపే అవకాశం ఉండి, కొంతైనా ప్రజాధనం వృథా తగ్గేది. కేవలం 12రోజుల కోసం రూకోట్లు వెచ్చించి భారీ ప్రకటనలు ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-04-21T02:15:53+05:30 IST