Share News

Nara Lokesh: నూజివీడు ఘటనపై మంత్రి లోకేష్ సీరియస్

ABN , Publish Date - Aug 31 , 2024 | 08:55 PM

నూజివీడు ట్రిపుల్ ఐటీలో పెద్దఎత్తున విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటి డైరక్టర్‎ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Nara Lokesh: నూజివీడు ఘటనపై మంత్రి లోకేష్ సీరియస్

అమరావతి: నూజివీడు ట్రిపుల్ ఐటీలో పెద్దఎత్తున విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటి డైరక్టర్‎ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల నూజివీడులో కలుషితాహారం తిని పెద్దఎత్తున విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనను నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరక్టర్‎ను ఆ బాధ్యతలనుంచి తప్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.


అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం పెంపొందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ పర్యవేక్షణ కోసం త్రిసభ్య కమిటీని మంత్రి నియమించించారు. ఇందులో కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యశాఖ ఇన్‎ఛార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, ఏలూరు కలెక్టర్ కె. వెట్రి సెల్వి కమిటీ సభ్యులుగా ఉన్నారు. పర్యవేక్షణ కమిటీ ఈ క్రింది అంశాలపై దృష్టిసారించాలని ఆదేశాలు జారీ చేశారు.


1. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత నిర్వహణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ పాటించడం.

2. పారిశుధ్యం, మెస్, పరిశుభ్రత నిర్వహణ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్ అమలుచేయడం.

3. విద్యార్థుల హాస్టల్‎లో మెరుగైన పారిశుధ్యం, నాణ్యతా ప్రమాణాల అమలుకు చర్యలు తీసుకోవడం.

4. నూజివీడు ట్రిపుల్ ఐటీలో అవసరాలకు అనుగుణంగా చిన్నచిన్న మరమ్మతులు చేయడం.

5. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి అంతర్గత ఫిర్యాదు కమిటీని ఏర్పాటు చేయడం

ఫిర్యాదుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వేగంగా వాటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం.

6. ప్రతి డిపార్ట్‌మెంట్ స్థాయిలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా డ్రగ్ ఫ్రీ, పొగాకు రహిత సంస్థల కోసం కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం.

ఆహార నాణ్యత, చిన్నచిన్న మరమ్మతులు, కొన్ని సున్నితమైన అంశాలు, వైద్య పర్యవేక్షణపై ఫిర్యాదులు వంటి సమస్యల తక్షణ పరిష్కారానికి నిర్ణీత సమయంతో కూడిన కార్యాచరణ ప్రణాళిక ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న వెంటనే కమిటీ ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Aug 31 , 2024 | 08:55 PM