CM Chandrababu: నామినేటెడ్ పదవులు.. నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
ABN , Publish Date - Jan 28 , 2025 | 04:43 PM
CM Chandrababu: వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ (క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పదవులు పొందే ప్రతి ఒక్కళ్లు పార్టీ స్ట్రక్చర్ అయిన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్లో ఉండాలని... అలాంటి వారినే పదవుల కోసం నాయకులు సిఫారసు చేయాలని వెల్లడించారు. ఏ స్థాయి వారు అయినా క్యూబ్స్లో మెంబర్గా ఉండాలని సీఎం తెలిపారు.

అమరావతి, జనవరి 28: టీడీపీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జ్లతో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. సీయూబీఎస్లో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులకు సిఫారసులు చేయాలని నేతలకు సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని... కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలన్నారు.
ఆ ప్రచారాన్ని ఎండగట్టండి...
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు వద్దకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు తెలిపారు. ప్రభుత్వ పని తీరును నిరంతరం పర్యవేక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని నిర్దేశించారు. ఏడు నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టామని.. ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని... ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని ఆదేశించారు. గత 5 ఏళ్లు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారని.. వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల విజయమని చెప్పుకొచ్చారు. కార్యకర్తలను ఎప్పుడూ గౌరవించుకోవాలని... ఎన్నికలు అయిపోయాయి తాను ఎమ్మెల్యే, ఎంపి అయిపోయాను అని ఎవరూ భావించవద్దన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Perninani Bail Petition: పేర్నినాని ముందస్తు బెయిల్పై హైకోర్టులో ఏం జరిగిందంటే
అందులో మెంబర్గా ఉండాల్సిందే...
వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ (క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. పదవులు పొందే ప్రతి ఒక్కళ్లు పార్టీ స్ట్రక్చర్ అయిన క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్లో ఉండాలని... అలాంటి వారినే పదవుల కోసం నాయకులు సిఫారసు చేయాలని వెల్లడించారు. ఏ స్థాయి వారు అయినా క్యూబ్స్లో మెంబర్గా ఉండాలన్నారు. 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయని 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. జూన్లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తామని తెలిపారు. పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని.. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని సీఎం అన్నారు.
ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే...
మెంబర్షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు. మంత్రులు.. జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కూర్చుని పార్టీ అంశాలపై చర్చించాలని.. సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు పని చేయాలన్నారు. ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చి చేరిన వారి కంటే... ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పని చేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని అన్నారు. మొదటి నుంచి పార్టీని నమ్మకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని స్పష్టం చేశారు. ప్రజల్లో సంతృప్తి ఉండాలని.. భవిష్యత్పై నమ్మకం, భరోసా కలగాలని ఇదే కూటమి ప్రభుత్వ విధానమన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తామని... భవిష్యత్ లో ఏం ఇస్తాం అనేది ప్రజలకు పార్టీ నేతలు వివరించాలన్నారు. పథకాలన్నీ ఇస్తామని... వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాని నేతలకు తెలియజేశారు. ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టామని... రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మీ వద్ద ఈ గేదెలు ఉంటే పంట పండినట్లే..
మూవీ థియేటర్స్.. మరో భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు!
Read Latest AP News And Telugu News