Ramadan Nara Lokesh: పేద ముస్లిం ఇంట లోకేశ్
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:20 AM
మంగళగిరిలో ఓ నిరుపేద ముస్లిం కుటుంబాన్ని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి లోకేశ్ వారితో ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కుటుంబ బాధ్యతను తీసుకుంటానని హమీ ఇస్తూ, కొత్త ఇంటిని నిర్మించిపెడతానని తెలిపారు.

మంగళగిరిలో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు
అక్కడే ఇఫ్తార్ విందు స్వీకరణ.. కుటుంబ బాధ్యత తీసుకుంటానని హమీ
మంగళగిరి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంత్రి లోకేశ్ శుక్రవారం రాత్రి తన నియోజకవర్గం మంగళగిరిలో.. ఓ నిరుపేద ముస్లిం ఇంటికి ఆకస్మికంగా వెళ్లి ఆ కుటుంబ సభ్యులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వారితో కలిసి ప్రార్ధనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ వేళ అనుకోని అతిఽథిగా లోకేశ్ తమ ఇంటికి రావడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. లోకేశ్ ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉండవల్లిలోని తన నివాసం నుంచి నేరుగా మంగళగిరి పాత శ్రీనివాసమహల్ పక్కనే వున్న మురికివాడకు చేరుకున్నారు. అక్కడ నిరుపేద ముస్లిం షేక్ షెహన్షా ఇంటికి వెళ్లారు. ఇది చాలా చిన్న ఇల్లు. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన వారు అంతలోనే తేరుకుని ఆయన్ను లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేశ్ వుధూ నిర్వహించి ముస్లింల సంప్రదాయ కుఫీ టోపీని ధరించారు.
అనంతరం వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత షెహన్షా కుటుంబసభ్యులకు పండ్లు తినిపించి ఉపవాసాన్ని విరమింపజేశారు. అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా లోకేశ్ ఆ ఇంటిని పరిశీలించి వారందరి యోగక్షేమాలను తెలుసుకున్నారు. చాలీచాలని సంపాదనతో ఎలాగో బతుకుతున్నామని వారు బాధగా చెప్పారు. దిగులుపడొద్దని లోకేశ్ వారికి భరోసా ఇచ్చి.. కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని హమీ ఇచ్చారు. ప్రస్తుత రేకుల ఇంటి స్థానంలో నూతన గృహాన్ని నిర్మించి ఇస్తానన్నారు. పిల్లలను కనీసం ఇంటర్ అయినా చదివిస్తే ప్రభుత్వం వృత్తివిద్య శిక్షణను ఇప్పించి ఉద్యోగాలను కల్పిస్తుందని చెప్పారు. అనంతరం లోకేశ్ షెహన్షా కుటుంబ సభ్యులకు పవిత్ర ఖురాన్తోపాటు వారందరికీ రంజాన్ బహుమతులను అందజేశారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..