నిధుల కొరత.. నిర్లక్ష్యం
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:50 AM
జలాశయాలు ఉన్నచోట్ల గేట్లు మరమ్మతులతోపాటు గట్లు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలకు ఇది అనువైన సమ యం. గడిచిన ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం గేట్ల మరమ్మతులను గాలికొదిలేసింది. బీటలు వారిన గట్ల పటిష్టతను నామ మాత్రపు చర్యలతో సరిపెట్టింది.

మరమ్మతులకు నోచుకోని జలాశయాల గేట్లు
ఏటా రైతులకు దినదినగండమే
ఈ సీజన్లో పనులు చేయకుంటే భవిష్యత్తులో పెను విపత్తే..
తక్షణం కదలాలి.. పనులు చేయాలి
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
జలాశయాలు ఉన్నచోట్ల గేట్లు మరమ్మతులతోపాటు గట్లు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలకు ఇది అనువైన సమ యం. గడిచిన ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం గేట్ల మరమ్మతులను గాలికొదిలేసింది. బీటలు వారిన గట్ల పటిష్టతను నామ మాత్రపు చర్యలతో సరిపెట్టింది. ప్రజల భద్రతను, రైతుల శ్రేయస్సు ను పట్టించుకోలేదు. ఇప్పుడు సరైన నిర్ణయాలు, చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వేసవిలోనే తమ్మిలేరు, ఎర్రకాలువ, జల్లేరు, కొవ్వాడ వంటి రిజర్వాయర్ల గేట్ల మరమ్మతులు చేపట్టా ల్సిన ఆవశ్యకత ఉంది. వేసవి తర్వాత ఈ జలాశయాల గేట్ల నుంచి లీకేజీ అత్యధికంగా ఉంటుంది. రిజర్వాయర్లకు చేరే నీరు ఎగువ ప్రాంతాల నుంచి అత్యధికంగా వచ్చి పడుతోంది. అప్పటికప్పుడు స్వల్ప మరమ్మతులు చేయడాని కి ఆస్కారమే లేదు. ఈ కారణంగానే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం స్పందించాలన్నదే రైతుల ఆకాంక్ష. తమ్మిలేరు జలాశయ పరిరక్షణకు జపాన్ నిధుల సాయంతో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం పరిస్థితి ఇలాంటిదే. గేట్ల మర మ్మతు, మెయింటినెన్స్ నిమిత్తం కనీసం నిధులు కేటా యించకపోవడం అలక్ష్యానికి సంకేతం. తాజాగా ఇప్పుడూ తగిన నిధులు కేటాయించలేదు. జల్లేరు జలాశయం గేట్ల మరమ్మతులకు, గేట్ల నిర్వహణ నిమిత్తం కొంత నిధులు కేటాయించారు. పనులైతే ఊపందుకోలేదు. కొవ్వాడ రిజర్వా యరు పరిస్థితి అంతంతే. కొండ వాగుల నీటిని ఇక్కడ భద్రపరిచి రైతుల అవసరాలకు వినియోగించే వారు. అలాంటి రిజర్వాయరుకు నిర్లక్ష్యం నీడ అలముకుంది.
జల్లేరు జలాశయానికి మహర్దశ..
బుట్టాయగూడెం : దొరమామిడి సమీపంలోని శ్రీ గుబ్బల మంగమ్మతల్లి జల్లేరు జలాశయం గేట్ల మరమ్మతు పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. దశాబ్దాలుగా ఈ గేట్లు మరమ్మతులకు గురైనా పట్టించుకున్న నాఽథుడు లేకపోవడంతో వీటిచుట్టూ వున్న రబ్బరు స్టాపర్స్ పాడై నీరు వృఽథాగా పోతుండేది. వీటికి మరమ్మతులు చేయించి వృథాను అరికట్టాలని చర్యలు తీసుకోవాలని రైతులు పలుమార్లు అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరినా స్పందన లేదు. 1978లో నిర్మించిన జలాశయానికి ఇంత వరకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టలేదు. వీటికి నిధులు కావాలంటూ ఇరిగేషన్ అధికారులు ఏటా ప్రతిపా దనలు పంపించినా.. వచ్చేవి కాదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గేట్ల మరమ్మతులకు విపత్తుల నిర్వహణ నిధులు రూ.8.42 లక్షలు విడుదలచేసింది. దీంతో ఇరిగేషన్ అధికారులు యుద్ధప్రాతిపదికన పాడైన వాటిని తొలగించి నూతన సామగ్రిని అమరుస్తున్నారు. గేట్ల చుట్టూ రబ్బర్ స్టాపర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల జలాశయంలో సాగు నీటిని నిలుపుదల చేసే అవకాశం ఉంటుందని ఏఈ సురేష్ తెలిపారు. గేట్లు తుప్పు పట్టకుండా కలర్స్ కోసం రూ.27 లక్షలతో ప్రతిపాదనలు పంపామని నిధులు విడుదలైన వెంటనే పనులు చేస్తామన్నారు.
నాలుగేళ్ల నుంచి పైసా రాలేదు
జంగారెడ్డిగూడెం : వేల ఎకరాలకు సాగు నీరందించే ఎర్రకాలువ జలాశయా న్ని పట్టించుకునే నాథులే కరువయ్యారు. వరద ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తారు. ఏటా జూన్లో జలాశయం నాలు గు గేట్లను ఇరిగేషన్ సిబ్బంది పరిశీలించి గేట్లకు గ్రీజు పెడతారు. నాలుగేళ్ల నుంచి జలాశయ గేట్ల మెయింటెనెన్స్ నిమిత్తం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి లేదు. ఇక్కడ పనిచేసే సిబ్బంది తమ సొంత డబ్బు రూ.40 వేలతో గ్రీజు కొని గేట్లకు పెడుతున్నారు. జనరేటర్కు అవసరమయ్యే డీజిల్ ఖర్చును సొంతంగానే భరిస్తున్నారు. 2019 కు ముందు టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం ఏటా రూ.15 నుంచి రూ.20 లక్షలు విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక చిల్లిగవ్వ విదల్చలేదు. ఫలితంగా 2018లో వరద ఉధృతి పెరిగినప్పుడు గేట్లు స్టక్ అవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. నాలుగు గేట్లకు 32 బేరింగులు తుప్పు పట్టి తిరగడంలేదు. వాటి స్థానంలో కొత్తవి వేయాల్సిఉండగా గతేడాది బడ్జెట్ లేక కేవలం ఒక్క బేరింగ్ మాత్రమే వేశారు. బేరింగులు తుప్పు పట్టి స్టక్ అవడం వల్ల గేట్లను ఎత్తడానికి, దింపడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వరద గేట్లకు మరమ్మతులేవీ ?
చింతలపూడి:ఏలూరు నగరాన్ని ముంపు బారి నుంచి కాపాడుకోవడానికి నాగిరెడ్డిగూడెం వద్ద నిర్మించిన తమ్మి లేరు రిజర్వాయరు వరద గేట్లు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. మెయింటినెన్స్ నిధులు లేక షట్టర్లకు గ్రీజు పెట్టాలన్నా పర్యవేక్షణ అధికారులే సొంత సొమ్ముతో పెట్టాల్సి వస్తోంది. ఈ రిజర్వాయర్ నుంచి మూడు వరద గేట్ల ద్వారా అదనపు నీరు దిగువకు వదులుతారు. షట్టర్ల వద్ద లీకేజీలు ఉన్నాయి. గేట్లు పూర్తిగా మూసినా నీరు వృథాగా పోతోంది. ఈ రిజర్వాయరు రెండు బేసిన్లు కలిగి ఉంటుంది. ఒకటి తమ్మిలేరు బేసిన్, రెండు గోనెల వాగు బేసిన్. వీటిని అనుసంధానం చేస్తూ లింక్ చానల్ ఏర్పాటు చేశారు. ఈ లింక్ చానల్పై మంకొల్లు నుంచి కోటపాడు వెళ్లే ప్రజలకు వంతెన నిర్మించారు. ఈ వంతెన రెయిలింగ్ దెబ్బతింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ్మిలేరు ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. కుడి, ఎడమ, మధ్య కాలువల ద్వారా తొమ్మిది వేల ఎకరాలు సాగవుతోంది. రాబోయే వర్షాకాలం సీజన్ నాటికి షట్టర్లకు మరమ్మతులు చేయకపోతే ఇబ్బందులే. లీకేజీల ద్వారా నీరు వృథా అవు తుంది. ఈ లీకేజీలు అరికట్టాలంటే షట్టర్లకు రబ్బర్ సీల్ ఏర్పాటు చేయాలి. షట్టర్లు తుప్పు పట్టి ఉన్నాయి. ప్రస్తు తం జైకా నిధులు రూ.16 కోట్లతో కాలువల మరమ్మతులు జరుగుతున్నాయి. గేట్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. శివపురం వద్ద కాజ్వే ఎత్తు లేపాలని ఇరువైపుల గ్రామా ల ప్రజలు కోరుతున్నారు. వరదల సమయంలో పల్లపు ప్రాంతం వైపు గండిపడి రాకపోకలు స్తంభిస్తున్నాయి.
రైతులకు సమృద్ధిగా నీరు
పోలవరం : కొవ్వాడ రిజర్వాయర్.. ఏటా కురిసిన వర్షాలకు జలకళతో ఉట్టిపడుతుంది. మెట్ట ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసే వర్షాలకు వాగులు, వంకలు పొంగి ఈ రిజర్వాయర్లోకి నీరు చేరుతుంది. వీటిని నిల్వ చేసి గోపాలపురం, పోలవరం మండలాల్లోని రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో వున్న మొక్కజొన్న, అపరాలు, వరి పంటలకు నీటిని అందిస్తున్నారు. తాజాగా రైతుల అభ్యర్థన మేరకు కుడి కాలువకు నాలుగు, ఎడమ కాలు వకు రెండు క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో ఈ ఏడాది రైతులకు రబీ గట్టెక్కే పరిస్థితులు కనిపించాయి. గతేడాది ఇదే సీజన్లో 83.50 మీటర్లు నమోదైన నీటిమట్టం ప్రస్తుతం 80.75 మీట ర్లుగా వుంది. గతేడాది కుడి కాలువకు మాత్రమే ఆరు క్యూసెక్కుల నీటిని అందించారు. ఎడమ కాలువకు నీటి అవసరం లేకపోయింది. రైతుల అభ్యర్థన మేరకు అవసర మైన నీటిని అందిస్తున్నామని, మేలో గేట్లకు గ్రీజింగ్ వర్క్, మరమ్మతులు చేస్తామని ఎల్ఎన్డీ పేట రిజర్వా యర్ ఏఈ రాహుల్ భాస్కర్ తెలిపారు.