Temple Anniversary: తులసమ్మా.. దీవించమ్మా
ABN , Publish Date - Apr 13 , 2025 | 11:37 PM
Temple Anniversary: మండలంలోని లొద్దపుట్టి గ్రామదేవత ధనరాజ తులసమ్మ తల్లి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు.

- అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లొద్దపుట్టి గ్రామదేవత ధనరాజ తులసమ్మ తల్లి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు వైభవంగా జరిపించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తులసమ్మా.. దీవించమ్మా అంటూ వేడుకున్నారు. అనంతరం అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయం వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ మీసాల చిన్నమనాయుడు, పట్టణ, రూరల్ ఎస్ఐలు ముకుందరావు, శ్రీనువాసరావు తమ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.
శ్రీకూర్మ క్షేత్రంలో..
గార, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామివారిని ఆదివారం ఉదయం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చైత్రమాసం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి క్యూలో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే, వత్సవలస రాజమ్మ జాతరకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో శ్రీకూర్మనాథుని దర్శించుకోవడంతో ఆలయం కిటకిటలాడింది. దేవదాయ శాఖ రిటైర్డ్ కమిషనర్ సుందరకుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
శ్రీకూర్మనాథుని దర్శనం కోసం క్యూలో భక్తులు